Mumbai: ముంబైలో జాతీయ జెండాలు పంపిణీ చేస్తూ సందడి చేసిన ఇజ్రాయెల్ దౌత్యవేత్త

  • దేశ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
  • ముంబైలో సందడి చేసిన ఇజ్రాయెల్ దౌత్యవేత్త
  • జాతీయ జెండాలు పంపిణీ చేస్తూ శుభాకాంక్షలు
Mumabi

Mumabi

దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. భారత త్రివర్ణ పతాకాలు అన్ని ప్రాంతాల్లో రెపరెపలాడుతున్నాయి. ఎంతో ఉత్సాహంగా.. ఆనందంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ముంబైలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ఇజ్రాయెల్ డిప్యూటీ కాన్సుల్ జనరల్ అవిషాగ్ హెఫర్‌ ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు భారత త్రివర్ణ పతాకాలను పంపిణీ చేశారు. ప్రజలను పలకరిస్తూ.. వారికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఇజ్రాయెల్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ మిడ్-వెస్ట్ ఇండియా ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. అందులో అవిషాగ్ హెఫర్ రద్దీగా ఉండే రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు త్రివర్ణ పతాకాలను అందజేస్తూ కనిపించారు. ఈ కార్యక్రమాన్ని ‘‘స్వేచ్ఛ, స్నేహం, భారతదేశ స్ఫూర్తి’’కి ప్రతీకగా కాన్సులేట్ అభివర్ణించింది.

‘హర్ ఘర్ తిరంగా’లో భాగంగా..

కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం ఈ ఏడాది ఆగస్టు 9 నుంచి 17 వరకు కొనసాగుతోంది. దేశ ప్రజలతో పాటు విదేశాల్లోని భారతీయులు, భారత్‌కు స్నేహితులుగా ఉన్నవారు కూడా జాతీయ జెండాను ప్రదర్శించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగస్వాములు కావాలని ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పిలుపునిచ్చింది. 2022లో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం.. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో కొనసాగుతోంది.

ఈ ఏడాది ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయిలోనూ విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు అక్కడి భారతీయులతో పాటు భారత్‌ను అభిమానించే వారిని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాయి. జాతీయ గీతం ‘వందే మాతరం’ 150వ వార్షికోత్సవ వేడుకలతోనూ ఈ కార్యక్రమాన్ని అనుసంధానించారు.

అవిషాగ్ హెఫర్‌కు భారత్‌లో ఇది రెండో స్వాతంత్ర్య దినోత్సవం. మీడియాతో మాట్లాడిన ఆమె.. తొలిసారి ముంబైకి వచ్చినప్పుడు నగరంలోని వేగవంతమైన జీవనశైలికి అలవాటు పడేందుకు కొంత సమయం పట్టిందని గుర్తుచేసుకున్నారు. మరోసారి భారత్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొంటుండటం ఆనందంగా ఉందని తెలిపారు.

ఇజ్రాయెల్ దౌత్యవేత్త పాల్గొనడంతో ప్రత్యేకత

ముంబైలోని అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటైన CSMTలో ఇజ్రాయెల్ దౌత్యవేత్త స్వయంగా భారత జెండాలను పంపిణీ చేయడం ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత్-ఇజ్రాయెల్ మధ్య సాంస్కృతిక, ప్రజా సంబంధాల కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆమె ‘హర్ ఘర్ తిరంగా’లో పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది.