IRCTC Scam Case: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి ఢిల్లీ కోర్టు షాక్ ఇచ్చింది. ఐఆర్సీటీకీ హోటళ్ల కాంట్రాక్టుల వ్యవహారానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆర్జేడీ అధినేత, మాజీ మంత్రి లాలూ, ఆయన భార్య రబ్రీ దేవీ, కుమారుడు తేజస్వీ యాదవ్లతో సహా 9 మందిపై అభియోగాలు నమోదు చేసేందుకు ఢిల్లీలోని రౌస్ఎవెన్యూ కోర్టు ఆదేశించింది. ఈ కేసులో నిందితులపై మనీలాండరింగ్కు సంబంధించిన బలమైన అనుమానాలు ఉన్నట్లు న్యాయమూర్తి విశాల్ గోగ్నే పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపు కోసమే ఈ కేసు పెట్టారనే నిందితుల వాదనల్ని కోర్టు కొట్టిపారేసింది. తాజా ఉత్తర్వుల్లో ఏడుగురు నిందితుల్ని కోర్టు కేసు నుంచి డిశ్చార్జ్ చేసింది.
కేసు ఏంటి.?
2004-2009 మధ్య లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఐఆర్సీటీసీ కాంట్రాక్టులకు సంబంధించి స్కామ్ జరిగింది. రాంచీ, పూరీలోని రైల్వే బీఎన్ఆర్ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టులను నిబంధనలకు విరుద్ధంగా సుజాతా హోటల్స్కు కట్టబెట్టారని సీబీఐ ఆరోపించింది. దీనికి ప్రతిఫలంగా పాట్నాలోని విలువైన భూముల్ని లాలూ కుటుంబానికి అనుబంధంగా ఉన్న సంస్థలకు తక్కువ ధరకు బదిలీ చేశారని దర్యాప్తు సంస్థ ఆరోపించింది.
ఈ వ్యవహారంలో కాంట్రాక్టులకు ప్రతిఫలంగా ‘‘క్విక్ ప్రోకో’’గా సీబీఐ ఆరోపించింది. సీబీఐ కేసు ఆధారంగా ఈడీ ఈ స్కామ్పై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ మొత్తం స్కామ్ ద్వారా వచ్చిన పాట్నా భూములపై రబ్రీ దేవీ, తేజస్వీ యాదవ్ నియంత్రణ సాధించారు. తాజాగా కోర్టు ఆదేశాలతో ఈడీ మనీలాండరింగ్ కేసు ఇప్పుడు ట్రయల్ దశలోకి వచ్చింది. అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులు అక్టోబర్ 03 కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంది.

