దేశంలో కరోనా కేసులు రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అటు ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు బీభత్సమైన రీతిలో నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన రాకపోకలపై విధించిన నిషేధాన్ని మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి నెలాఖరు వరకు షెడ్యూల్డ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ప్యాసింజర్ సర్వీసులపై నిషేధం ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బుధవారం వెల్లడించింది.
Read Also: గోవా అసెంబ్లీ పోల్.. సీఎం అభ్యర్థిని ప్రకటించిన కేజ్రీవాల్
గతంలో అంతర్జాతీయ విమానాలపై జనవరి 31 వరకు కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించగా… తాజాగా ఆ నిషేధాన్ని మరోసారి పొడిగించింది. అయితే ఎయిర్ బబూల్ అగ్రిమెంట్స్, మిషన్ వందే భారత్ విమానాలు, ఎయిర్ కార్గో విమానాలకు మాత్రం మినహాయింపు ఉంటుందని డీజీసీఏ స్పష్టం చేసింది. కాగా తొలిసారిగా కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను మార్చి 23, 2020 నుంచి నిలిపివేయగా… ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ ప్రకారం జూలై 2020 నుంచి కొన్ని విమానాలను నడుపుతున్నారు. ఎయిర్ బబుల్ మేనేజ్మెంట్ పాటిస్తున్న దేశాల్లో భారత్, అమెరికా, బ్రిటన్, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ దేశాలు ఉన్నాయి.
