Rahul Gandhi: నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం వివాదాస్పదంగా మారుతోంది. మే 28న ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం కాబోతోంది. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే ఈ కార్యక్రమానికి హాజరుకామని 19 ప్రతిపక్ష పార్టీలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్య రాష్ట్రపతిని అవమానించడమే అని అన్నారు.
Read Also: Uttar Pradesh: మధురలో దారుణం.. 75 ఏళ్ల పూజారిని చంపిన దుండగులు..
కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించేందుకు అధ్యక్షురాలు ద్రౌపది ముర్మును ఆహ్వానించకపోవడం, దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిని అవమానించడమే అని రాహుల్ గాంధీ అన్నారు. పార్లమెంటును ‘‘అహంతో కూడిన ఇటుకలతో’’ నిర్మించలేరని, రాజ్యాంగ విలువల ద్వారా నిర్మించబడుతుందని ఆయన బీజేపీని విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు. కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆమె ముందున్న రామ్నాథ్ కోవింద్లను బీజేపీ ఆహ్వానించలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం అన్నారు.
కాంగ్రెస్, డిఎంకె, ఆప్, టిఎంసి, శివసేన (యుబిటి), సమాజ్వాదీ పార్టీ (ఎస్పి), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ), జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం), కేరళ కాంగ్రెస్ (మణి), విడుతలై చిరుతైగల్ కట్చి (విసికె), రాష్ట్రీయ లోక్ దళ్ (RLD), JD(U), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (CPM), రాష్ట్రీయ జనతాదళ్ (RJD), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML), నేషనల్ కాన్ఫరెన్స్ (NC), రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (RSP), మరియు మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం (MDMK) పార్టీలు కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించాయి.