Instagram: భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్ నిషేధం! సోషల్ మీడియాలో పుకార్లు

  • భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్ నిషేధం!
  • సోషల్ మీడియాలో పుకార్లు
  • క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
Nstagram

Nstagram

ప్రస్తుతం ప్రపంచం సోషల్ మీడియాపై నడుస్తోంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకూ సామాజిక మాధ్యమాలతోనే గడుపుతున్నారు. అంతగా మనిషి జీవితంలో సోషల్ మీడియా భాగమైపోయింది. అలాంటిది గత కొన్ని రోజులుగా ఆగస్టు 25 నుంచి భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ను నిషేధించనున్నారని ఒక వార్త వైరల్ అవుతోంది. ఈ వార్తతో లక్షలాది మంది ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టత ఇచ్చింది. ఈ వార్త పూర్తిగా అవాస్తవమని, ఎలాంటి నిషేధ నిర్ణయం తీసుకోలేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం వెల్లడించింది.

పీఐబీ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. ‘‘2026 ఆగస్టు 25 రాత్రి నుంచి భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ను బ్యాన్ చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం పూర్తిగా తప్పుడు సమాచారం. ఇలాంటి ఎలాంటి ప్రకటనను భారత ప్రభుత్వం విడుదల చేయలేదు.’’ అని స్పష్టం చేసింది. అలాగే ప్రజలు ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని, ధృవీకరించకుండా ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని సూచించింది. ఇన్‌స్టాగ్రామ్ నిషేధం అంటూ వచ్చిన పోస్టులు వేగంగా వైరల్ కావడంతో పలువురు వినియోగదారులు తమ ఫొటోలు, వీడియోలు, డేటాను ముందుగానే డౌన్‌లోడ్ చేసుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, మెటా లేదా ఇతర ప్రభుత్వ సంస్థలు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ఎక్కడా ప్రకటించలేదు.

ప్రస్తుతం భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్ యథావిధిగా పనిచేస్తోంది. ఆగస్టు 25 నుంచి దేశవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌పై ఎలాంటి నిషేధం అమల్లోకి రానుందని అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. ప్రభుత్వ విధానాలు, కీలక నిర్ణయాలకు సంబంధించిన వార్తలను నమ్మే ముందు తప్పనిసరిగా అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్లు, పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వంటి విశ్వసనీయ వనరుల ద్వారా ధృవీకరించుకోవాలని అధికారులు సూచించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రతి సమాచారాన్ని నిజమని భావించకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.