IndiGo Plane Hits Pole at Srinagar Airport: ఇండిగో విమానానికి శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదం జరిగింది. ల్యాండింగ్ అనంతరం విమానాన్ని పార్కింగ్ బేకు తరలిస్తున్న సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన గైడెన్స్ పోల్ను విమానం ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ప్రయాణికులు, విమాన సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.
పార్కింగ్ పోల్ను ఢీకొన్న ఇండిగో విమానం
ఇండిగోకు చెందిన 6E 225 (VT-NOG) విమానం నవీ ముంబై నుంచి శ్రీనగర్కు బయలుదేరింది. శుక్రవారం ఉదయం సుమారు 9:02 గంటలకు విమానాన్ని శ్రీనగర్ ఎయిర్పోర్టులోని బే నంబర్ 06లోకి తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విమానాన్ని పార్కింగ్ స్థానంలోకి సరిగ్గా నిలిపే సమయంలో ఉపయోగించే Visual Docking Guidance System (VDGS) పోల్ను విమానం ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు.
ప్రయాణికులు, సిబ్బంది సురక్షితం
ఈ ఘటనలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా బయటకు వచ్చారు. ఎవరికీ గాయాలు కాలేదని శ్రీనగర్ విమానాశ్రయ అధికారులు స్పష్టం చేశారు. విమానంలోని ప్రయాణికులు, సిబ్బందిని మాన్యువల్ ఎయిర్క్రాఫ్ట్ మెట్ల సహాయంతో సురక్షితంగా కిందికి దించారు. అనంతరం ఘటనపై అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు.
ప్రమాదానికి కారణమేంటి?
విమానం పోల్ను ఢీకొట్టడానికి అసలు కారణం ఏమిటనే దానిపై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయానికి రాలేదు. ఘటనకు దారితీసిన పరిస్థితులను తెలుసుకునేందుకు నిర్దేశిత విధానాల ప్రకారం సమగ్ర విచారణ ప్రారంభించారు. విచారణ పూర్తయిన తర్వాతే ప్రమాదానికి ఖచ్చితమైన కారణం తెలుస్తుందని అధికారులు తెలిపారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఘటనకు సంబంధించి ఎలాంటి తుది నిర్ణయానికి రావడం లేదని స్పష్టం చేశారు.
శ్రీనగర్ ఎయిర్పోర్టు కార్యకలాపాలు సాధారణంగానే
ప్రమాదం జరిగినప్పటికీ శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఏర్పడలేదని అధికారులు తెలిపారు. విమాన రాకపోకలు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రయాణికులు, విమానయాన సంస్థలు, ఇతర భాగస్వాముల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని శ్రీనగర్ ఎయిర్పోర్టు అధికారులు పేర్కొన్నారు.
24 గంటల్లో ఇండిగోకు సంబంధించిన రెండో ఘటన
ఇదిలా ఉండగా, గత 24 గంటల్లో ఇండిగో విమానానికి సంబంధించిన ఇది రెండో ఘటన కావడం గమనార్హం. గురువారం దోహా నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఇండిగో విమానాన్ని పైలట్ అనారోగ్యానికి గురికావడంతో మస్కట్కు మళ్లించారు. ఈ విమానం 6E 1302 కాగా, ఎయిర్బస్ A321 విమానంతో ఈ సర్వీస్ నడిచింది.
అనారోగ్యానికి గురైన పైలట్కు చికిత్స
విమానంలోని ఆపరేటింగ్ సిబ్బందిలో ఒకరికి అత్యవసర వైద్య సహాయం అవసరమైన కారణంగా విమానాన్ని మస్కట్కు మళ్లించినట్లు ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. విమానం మస్కట్లో ల్యాండ్ అయిన తర్వాత అనారోగ్యానికి గురైన సిబ్బందికి వైద్య బృందం చికిత్స అందించినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని తెలిపింది. ప్రయాణికుల ప్రయాణాన్ని కొనసాగించేందుకు ప్రత్యామ్నాయ విమానం, కొత్త సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు ఇండిగో వెల్లడించింది. ఈ ఘటనపై కూడా దర్యాప్తు నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే పైలట్కు అసలు ఏం జరిగిందనే విషయాన్ని విమానయాన సంస్థ వెల్లడించలేదు. విచారణ అనంతరం మరిన్ని వివరాలు అందిస్తామని పేర్కొంది.

