Hydrogen Train: భారతీయ రైల్వే తన మొట్టమొదటి ‘‘హైడ్రోజన్ రైలు’’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రైలు హర్యానాలోని నార్తర్న్ రైల్వే పరిధిలోని జింద్-సోనిపట్ మార్గంలో నడుస్తుంది. బ్రాడ్ గేజ్ నెట్వర్క్పై నడవబోతున్న ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, పొడవైన హైడ్రోజన్ రైలుగా దీనిని అభివర్ణిస్తున్నారు. ప్రపంచంలో ప్రస్తుతం జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి దేశాల వద్దే హైడ్రోజన్ రైలు ఉంది. ఇప్పుడు ఈ జాబితాలో భారత్ కూడా చేరుతోంది.
హైడ్రోజన్ రైలు ప్రత్యేకతలు ఇవే:
ఈ రైలులో 10 కోచ్లు ఉంటాయి. రెండు డ్రైవింగ్ పవర్ కార్లలో ఒక్కోదానికి 1200 కిలోమీట్ల సామర్థ్యం కలిగిన హైడ్రోజన్ ఫ్యూ్యల్ సెల్ వ్యవస్థ ఉంటుంది. మొత్తం దీని పవర్ 2400 కిలోవాట్లు. దీని కమర్షియల్ స్పీడ్ గంటకు 75 కిలోమీటర్లు. ట్రయల్ సమయంలో ఇది గంటకు 120 కి.మీ వేగంతో నడిచింది. ఒక్కసారి హైడ్రోజన్ నింపితే సుమారు 250 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. ప్రత్యేకంగా హైడ్రోజన్ సిలిండర్లు, బ్యాటరీలు, కంట్రోల్ సిస్టమ్ కోసం ప్రత్యేక భాగాలు ఉన్నాయి.
హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలా పనిచేస్తుంది?
డీజిల్, ఎలక్ట్రిక్ లోకోమోటివ్లతో పోలిస్తే హైడ్రోజన్ రైలు వల్ల కాలుష్యం తక్కువ. ఈ రైలులో హైడ్రోజన్, ఆక్సిజన్ మధ్య జరిగే రసాయన చర్య ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రక్రియలో నీటి ఆవిరి, స్వల్పంగా వేడి మాత్రమే విడుదలవుతుంది. కార్బన్ ఉద్గారాలు ఉండవు.
రైలు ముందు భాగంలో 27, వెనక భాగంలో 27 హైడ్రోజన్ సిలిండర్లు ఏర్పాటు చేశారు. స్వదేశీ సాంకేతికతతో హైడ్రోజన్ నిల్వ, రీఫ్యూయలింగ్ కేంద్రాన్ని జింద్లో నిర్మించారు. ఈ రైలులో భద్రతకు పెద్ద పీట వేశారు. హైడ్రోజన్ లీక్ డిటెక్టర్లు, ఫ్లేమ్ డిటెక్టర్లు, భద్రతా సెన్సార్లు ఏర్పాటు చేశారు. ఆత్మ నిర్భర భారత్ ప్రోగ్రాంలో భాగంగా దీనిని పూర్తిగా భారత్లోనే రూపొందించారు. రిసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO), లక్నో డిజైన్ అందించగా, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ-చెన్నైలో తయారు చేశారు.
జింద్–సోనిపట్ మార్గంలోనే ఎందుకు..?
ప్రస్తుతం భారత్లోని రైల్వే బ్రాడ్ గేజ్ నెట్వర్క్లో 92 శాతం విద్యుదీకరణ పూర్తయింది. దీని వల్ల ఈ మార్గాల్లో హైడ్రోజన్ రైలును నడిపితే ప్రయోజనం ఉండదు. విద్యుత్ లైన్లు వేయడం కష్టమైన ప్రాంతాలు, హెరిటేజ్ రైల్వే మార్గాల్లో వీటిని ఉపయోగించాలని రైల్వే శాఖ భావిస్తోంది.

