India On Nepal: భారత్తో సరిహద్దు వివాదంపై నేపాల్ ప్రధాని బాలెన్ షా ప్రగల్భాలు పలకడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేపాల్తో ఉన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవడానికి మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీ ప్రాంతాలపై రెండు దేశాల మద్య వివాదం ఉంది. అయితే, ఇటీవల ఈ మార్గాల ద్వారా చైనాతో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించడంపై నేపాల్ తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది.
ఇటీవల నేపాల్ పార్లమెంట్లో ఆ దేశ ప్రధాని బాలెన్ షా మాట్లాడుతూ.. సమస్య పరిష్కారానికి బ్రిటన్, చైనాలతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. ఈ వివాదంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. సరిహద్దు సమస్యకు సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరించుకోవడానికి ఇరుపక్షాలు ద్వైపాక్షిక యంత్రాంగాలను ఏర్పాటు చేసుకున్నాయని, భారత్-నేపాల్ సరిహద్దులో సుమారు 98 శాతం సరిహద్దును గుర్తించామని చెప్పారు.
లిపులేఖ్, లింపియాధుర, కాలాపానీ ప్రాంతాలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భాగమని భారత్ చెబుతుంది. అయితే, ఈ ప్రాంతాలు తమవే అని నేపాల్ వాదిస్తోంది. కేపీ శర్మ ఓలీ నేపాల్ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ వివాదం చెలరేగింది. బాలెన్ షా ఇటీవల మాట్లాడుతూ.. నేపాల్ కూడా భారత భూభాగాన్ని ఆక్రమించిందని చెప్పడం వివాదాస్పదమైంది. ఆయన ప్రకటనపై సొంతదేశంలోని నెటిజన్లే విమర్శలు చేస్తున్నారు.
