India On PoK: పీఓకే ఎన్నికలు కేవలం నాటకం.. పాకిస్తాన్‌పై భారత్ ఫైర్..

  • పీఓకే ఎన్నికలు కేవలం నాటకం మాత్రమే..
  • పాకిస్తాన్ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన భారత్..
Pok

Pok

India On PoK: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో పాకిస్తాన్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్నికల్ని భారత్ ‘‘కాస్మెటిక్ ఎన్నికలు’’గా అభివర్ణించింది. అక్రమ ఆక్రమణకు చట్టబద్ధత కల్పించేందుకు, అక్కడి మానవ హక్కుల ఉల్లంఘనల్ని కప్పిపుచ్చేందుకు పాక్ ఈ ఎన్నికల్ని ఉపయోగించుకుంటోందని విదేశాంగ శాఖ తీవ్ర విమర్శలు చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలు, పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన ప్రాంతాలతో సహా భారతదేశంలో అంతర్భాగమే అని మరోసారి భారత్ తేల్చి చెప్పింది. పీఓకేలో నిరసనలు అక్కడి ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు నిదర్శమని ఆయన అన్నారు. పీఓకేలో ప్రజల్ని పాకిస్తాన్ ఆర్థికంగా దోపిడీ చేయడం, ప్రాథమిక హక్కులు నిరాకరించడం, అణచివేతకు వ్యతిరేకంగా అక్కడ నిరసనలు జరుగుతున్నాయని అన్నారు. భారత్ ఎప్పటి నుంచో ఈ ప్రాంతంపై పాకిస్తాన్‌కు ఎలాంటి చట్టబద్ధమైన హక్కు లేదని, అక్కడ తీసుకునే రాజకీయ, పరిపాలన నిర్ణయాలకు ఎలాంటి న్యాయబద్ధత లేదని స్పష్టం చేస్తూ వస్తోంది.