జూన్ నెల 4 రోజుల్లో ముగిసిపోనుంది. కానీ ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో ఏ రాష్ట్రంలోనూ వర్షాలు కురవలేదు. ఇంకోవైపు అన్నదాత ఆకాశం వైపు చూస్తున్నాడు. వాన జాడ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నాడు. కానీ వర్ష మాత్రం కురవడం లేదు. తాజాగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తాజాగా విడుదలైన శాటిలైట్ చిత్రాలు దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్ష మేఘాలు కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. జూన్ చివరి వారంలో సాధారణంగా విస్తారంగా కనిపించాల్సిన వర్ష మేఘాలు మధ్య, పశ్చిమ, వాయువ్య భారతదేశంలో కనిపించకపోవడం విశేషం. భారత వాతావరణ శాఖ (IMD) గణాంకాల ప్రకారం.. జూన్ 4 నుంచి జూన్ 26 వరకు దేశంలో సాధారణంతో పోలిస్తే 45 శాతం వర్షపాతం లోటు నమోదైంది. గురువారం ఉదయం తీసిన INSAT-3DR ఇన్ఫ్రారెడ్ శాటిలైట్ చిత్రాల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించింది.
ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర బంగాళాఖాతం, దక్షిణ ద్వీపకల్పంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దట్టమైన వర్ష మేఘాలు కనిపించాయి. అయితే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ-ఎన్సీఆర్ వంటి విస్తార ప్రాంతాల్లో సాధారణంగా రుతుపవనాల సమయంలో కనిపించే భారీ వర్ష మేఘాలు దాదాపు లేకపోవడం గమనార్హం.
IMD రాష్ట్రాల వారీగా విడుదల చేసిన వర్షపాతం గణాంకాల ప్రకారం.. మధ్య, ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాలు తీవ్ర వర్షాభావాన్ని ఎదుర్కొంటున్నాయి. మధ్యప్రదేశ్లో సాధారణ వర్షపాతంలో సగం మాత్రమే నమోదైంది. ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కూడా గణనీయమైన వర్షపాతం లోటు నమోదైంది. ముఖ్యంగా గుజరాత్లో సాధారణంతో పోలిస్తే 84 శాతం తక్కువ వర్షపాతం నమోదవడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.
వర్షాలు తగ్గడానికి కారణమేంటి?
వాతావరణ నిపుణుల ప్రకారం.. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో బలమైన అల్పపీడన వ్యవస్థలు ఏర్పడకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా ఈ అల్పపీడనాలు భూభాగంలోకి ప్రవేశించి తేమను తీసుకువస్తాయి. కానీ ప్రస్తుతం అలాంటి వ్యవస్థలు లేకపోవడంతో దేశ అంతర్భాగాలకు తేమ సరఫరా తగ్గి విస్తృతంగా వర్షాలు కురవడం లేదు.
అయితే వాతావరణ శాఖ అంచనాల ప్రకారం పరిస్థితి త్వరలో మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. భూమధ్యరేఖకు ఉత్తరంగా తూర్పు హిందూ మహాసముద్రంలో ప్రస్తుతం ఒక పెద్ద ఉష్ణమండల వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోంది. ఇది వచ్చే 4 నుంచి 7 రోజుల్లో బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ వ్యవస్థ బలపడితే భారీగా తేమను రుతుపవనాల్లోకి నెట్టివేసి.. బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు సృష్టించనుంది. అదే సమయంలో పశ్చిమ భారతదేశంలో మిడిల్ ట్రోపోస్ఫెరిక్ వోర్టెక్స్ (MTV) ఏర్పడే అవకాశమూ ఉందని వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి. ఈ రెండు వ్యవస్థలు అనుకున్న విధంగా అభివృద్ధి చెందితే జూలై తొలి వారంలో నిలిచిపోయిన రుతుపవనాలు మళ్లీ చురుకుగా మారి.. వాయువ్య భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వ్యవస్థల బలం, కదలికలను బట్టి వర్షాల పునరుద్ధరణ సమయం, తీవ్రతలో మార్పులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

