Bitchat: ఢిల్లీలో కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనల్లో ‘‘బిట్చాట్ యాప్’’ కీలకంగా మారింది. మొబైల్ నెట్వర్క్, ఇంటర్నెట్ లేకున్నా బ్లూటూత్ ఆధారంగా పనిచేసే ఈ యాప్ వల్ల నిరసనలు తీవ్రమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఈ యాప్పై కేంద్రం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ఈ యాప్ను రూపొందించిన గిట్హబ్కు కీలక ఆదేశాలు జారీ చేసింది. బిట్చాట్ మెసేసింగ్ యాప్కు సంబంధించిన గిట్హబ్ రిపోజిటరీలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది.
ట్విట్టర్ సహవ్యవస్థాపపకుడు జాక్ డోర్సీ ఈ యాప్ను డెవలప్ చేశాడు. భారత ప్రభుత్వం జారీ చేసిన నోటీసుల్ని ఆయన ఎక్స్ వేదికగా షేర్ చేశాడు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(I4C) గిట్హబ్కు నోటీసు జారీ చేసింది. సమాచారం సాంకేతిక చట్టం-2000 లోని సెక్షన్ 79(3)(బి), అలాగే ఐటీ రూల్స్–2021లోని నిబంధనల కింద, గిట్బాట్కు చెందిన మూడు గిట్బాట్ రిపోజిటరీలను3 గంటల్లో బ్లాక్ చేయాలని లేదా యాక్సెస్ నిలిపేయాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. వీటిలో ప్రధాన ప్రాజెక్ట్ రిపోజిటరీతో పాటు ఆండ్రాయిడ్ వెర్షన్ కూడా ఉన్నాయి.
ప్రభుత్వం ఆందోళన ఏమిటి?
ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం.. బిట్చాట్ మొబైల్ ఇంటర్నెట్, ఇంటర్నెట్ లేదా సెంట్రల్ సర్వర్లపై ఆధారపడకుండా బ్లూటూత్ మెష్ నెట్వర్క్ ద్వారా మెసేజ్లు పంపించుకునే వికేంద్రీకృత కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్. ఇలాంటి వ్యవస్థల వల్ల పోలీసులు, చట్టాన్ని అమలు చేసే అధికారులు మెసేజ్లను పర్యవేక్షించడం, మూలాన్ని గుర్తించడం, దర్యాప్తు నిర్వహించడం కష్టమవుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఇంటర్నెట్ నిలిపేసిన కూడా ఈ యాప్ ద్వారా వ్యక్తులు పరస్పరం సమాచారాన్ని పంచుకోవచ్చని, ఇది చట్టవ్యతిరేక సమావేశాలు, హింసాత్మక నిరసనలు, తప్పుడు సమాచార వ్యాప్తి వంటి కార్యకలాపాలకు ఉపయోగపడే అవకాశం ఉందని నోటీసుల్లో పేర్కొంది.
సీజేపీ నిరసన నేపథ్యంలో వివాదం:
ఢిల్లీలోని సీజేపీ నిరసనల సమయంలో కొన్ని ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ నిలిపేసిన, నిరసనకారులు బ్లూటూత్ మెసేజింగ్ యాప్ ద్వారా సందేశాలు పంపుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే, ఈ బిట్చాట్ యాప్ నిరసనకారులు ఉపయోగించారని ఇప్పటి వరకు అధికారులు ధ్రువీకరించలేదు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బిట్చాట్ ప్రత్యేకత ఏమిటి.?
ఈ నెల ప్రారంభంలో జాక్ డోర్సీ బిట్చాట్ ఓపెన్ సోర్స్ మెసేజింగ్ యాప్ను రిలీజ్ చేశారు. దీనిని ఉపయోగించుకునేందుకు మొబైల్ నెంబర్, ఇంటర్నెట్, వైఫై లేదా సెంట్రలైజ్డ్ సర్వర్ అవసరం ఉండదు. బ్లూటూత్ లో ఎనర్జీ(బీఎల్ఈ) ఆధారంగా పనిచేసే ఈ యాప్, సమీపంలోని ఇతర ఫోన్ల ద్వారా ఎన్క్రిప్టెడ్ సందేశాలను ఒక డివైస్ నుంచి మరో డివైజ్కు పంపిస్తుంది. ఇంటర్నెట్ లేకపోయినా కమ్యూనికేషన్ సాధ్యమవుతుంది.

