Energy Crisis: భారత్‌లో మరోసారి ఇంధన సంక్షోభం రానుందా? నిపుణుల ఆందోళన ఎందుకు?

  • మరో ఇంధన సంక్షోభం దిశగా సంకేతాలు
  • యెమెన్-సౌదీ యుద్ధంతో డేంజర్ బెల్స్
  • భారత్‌కు సవాలే అంటున్న నిపుణులు
Energy Crisis

Energy Crisis

భారత్‌లో మరోసారి ఇంధన సంక్షోభం రానుందా? మళ్లీ వాహనదారులు పెట్రోల్ బంకుల దగ్గర క్యూ కట్టాల్సిన పరిస్థితులు రానున్నాయా? అంతేకాకుండా ధరలు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇరాన్-అమెరికా యుద్ధంతో కొన్ని రోజుల పాటు గ్యాస్, ఇంధన సంక్షోభం తలెత్తింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పశ్చిమాసియాలో పరిస్థితులు సద్దుమణుగుతాయనుకుంటే.. రోజు రోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తాజాగా యెమెన్-సౌదీ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో భారీ ఇంధన సంక్షోభం తలెత్త వచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇరాన్ హార్ముజ్ జలసంధిపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగిస్తున్న బాబ్ ఎల్-మండెబ్ (Bab el-Mandeb) జలసంధి కూడా ఇప్పుడు ఉద్రిక్తతల కేంద్రంగా మారింది. దీంతో భారత్ ఇంధన భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కీలక సముద్ర మార్గంలో అంతరాయం ఏర్పడితే ముడి చమురు సరఫరా, రిఫైనరీల కార్యకలాపాలు, రవాణా ఖర్చులు, పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రాయిటర్స్ కథనం ప్రకారం.. జూలై 26న యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్ర తీరంలోని సౌదీ అరేబియా చమురు స్థావరాలపై దాడులు చేసిన తర్వాత బాబ్ ఎల్-మండెబ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇదే సమయంలో హార్ముజ్ జలసంధి గుండా కూడా నౌకల రాకపోకలు ఇప్పటికే మందగించాయి.

నిపుణుల అంచనాల ప్రకారం.. సాధారణంగా రోజుకు 60 నుంచి 70 లక్షల బ్యారెళ్ల ముడి చమురు బాబ్ ఎల్-మండెబ్ జలసంధి గుండా రవాణా అవుతుంది. ఇందులో దాదాపు సగం సౌదీ అరేబియాలోని యన్బు (Yanbu) పోర్టు నుంచి ఎగుమతి చేసే చమురే. మిగిలిన వాటిలో ఎక్కువ భాగం భారత్‌కు వచ్చే రష్యా ముడి చమురు కాగా.. కొంత చైనా వైపు వెళ్తుంది.

గ్రాంట్ థార్న్టన్ భారత్ డైరెక్టర్ ప్రవీణ్ రాయ్ మాట్లాడుతూ.. హార్ముజ్, బాబ్ ఎల్-మండెబ్ రెండు జలసంధులు ఒకేసారి ప్రభావితమైతే భారత్‌కు తీవ్ర సరఫరా సంక్షోభం ఎదురవుతుందని హెచ్చరించారు. యన్బు పోర్టు నుంచి వచ్చే సౌదీ చమురుతో పాటు సూయజ్ కాలువ-ఎర్ర సముద్రం-బాబ్ ఎల్-మండెబ్ మార్గంలో భారత్‌కు చేరే రష్యా ముడి చమురు సరఫరా కూడా దెబ్బతింటుందని తెలిపారు. దీంతో ఆఫ్రికా చుట్టూ ప్రత్యామ్నాయ మార్గం ఉపయోగించాల్సి రావడం వల్ల సరఫరా వ్యవస్థ మరింత ఖరీదుగా మారుతుందని చెప్పారు.

బాబ్ ఎల్-మండెబ్‌లో అంతరాయం కొనసాగితే నౌకలు కేప్ ఆఫ్ గుడ్ హోప్ (ఆఫ్రికా దక్షిణ కొన) మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. దీంతో ప్రయాణ సమయం సుమారు రెండు వారాలు పెరుగుతుంది. దీని కారణంగా ఇంధన వినియోగం పెరుగుతుంది. నౌకల అద్దె ఛార్జీలు పెరుగుతాయి. యుద్ధ ప్రమాద బీమా (War-risk Insurance) ప్రీమియంలు భారీగా పెరుగుతాయి. దిగుమతి అయ్యే ముడి చమురు ధరలు మరింత అధికమవుతాయి. ఆసియా దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

కేప్లర్ విశ్లేషకుడు సుమిత్ రిటోలియా ప్రకారం.. సౌదీ అరేబియా ఇప్పటికే హార్ముజ్‌పై ఆధారాన్ని తగ్గిస్తూ యన్బు పోర్టు ద్వారా భారీ ఎత్తున చమురు ఎగుమతులు చేస్తోంది. జూన్‌లో అక్కడి నుంచి రోజుకు 41.4 లక్షల బ్యారెళ్ల చమురు ఎగుమతి అయింది. అయితే దీంతో ఎర్ర సముద్రం-బాబ్ ఎల్-మండెబ్ మార్గం మరింత కీలకంగా మారిందని.. అక్కడ అంతరాయం ఏర్పడితే భారత్, దక్షిణ కొరియా, జపాన్ వంటి ఆసియా దేశాల రిఫైనరీలు వెంటనే ప్రభావితమవుతాయని చెప్పారు.

ఈ సంక్షోభం భారత్ చమురు దిగుమతులకే కాకుండా పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎర్ర సముద్రం-సూయజ్ కాలువ మార్గమే యూరప్‌కు అత్యంత వేగవంతమైన సముద్ర మార్గం కావడంతో డీజిల్, ఏటీఎఫ్ (విమాన ఇంధనం), పెట్రోల్, నాఫ్తా,
ఫ్యూయల్ ఆయిల్, పెట్రోకెమికల్ ఉత్పత్తుల ఎగుమతులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దీంతో యూరప్ మార్కెట్‌లో భారత ఉత్పత్తుల పోటీతత్వం తగ్గవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జూన్ నాటికి భారత్ దిగుమతి చేసే ముడి చమురులో రష్యా వాటా రికార్డు స్థాయిలో రోజుకు 25.8 లక్షల బ్యారెళ్లకు చేరి.. మొత్తం దిగుమతుల్లో 50 శాతానికి పైగా నిలిచింది. యూఏఈ, సౌదీ అరేబియా కూడా ప్రధాన సరఫరాదారులుగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నైజీరియా, అంగోలా వంటి పశ్చిమ ఆఫ్రికా దేశాలు, అమెరికా గల్ఫ్ కోస్ట్, బ్రెజిల్, గయానా వంటి లాటిన్ అమెరికా దేశాల నుంచి కొనుగోళ్లు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే విశాఖపట్నం, మంగళూరు, పడూర్‌లో ఉన్న వ్యూహాత్మక చమురు నిల్వలను అవసరమైతే వినియోగించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు నిపుణులు సూచిస్తున్నారు.