Covid-19: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే..?

Corona Virus

Corona Virus

దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ప్రభావం కారణంగా కేసులు పెరుగుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం దేశవ్యాప్తంగా 1150 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న 975 కరోనా కేసులు నమోదు కాగా.. నేడు అవి 1150కి పెరిగాయి. దీంతో ఒక్కరోజు తేడాలో 17 శాతం కరోనా కేసులు పెరిగినట్లు తెలుస్తోంది. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో కరోనా కేసుల మొత్తం సంఖ్య 4,30,42,097కి చేరింది. ఇందులో 4,25,08,788 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.

గత 24 గంటల్లో నలుగురు మరణించగా 954 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో ఇప్పటి వరకు 5,21,751 మంది మృతిచెందినట్లు హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇంకా 11,558 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అంటే 0.03 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని పేర్కొంది. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 1.21 శాతం మంది మరణించారని వెల్లడించింది. మరోవైపు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,86,51,53,593 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని, శనివారం 12,56,533 మందికి వ్యాక్సిన్‌లు వేశామని కేంద్రం తెలిపింది.