India Pakistan: పాకిస్తాన్ విమానాలకు భారత గగనతలం మూసివేత, నౌకలపై బ్యాన్.!

  • పాకిస్తాన్‌కి భారీ షాక్ ఇవ్వబోతున్న ఇండియా.. పాక్ విమానాలకు భారత గగనతలం మూసివేత..!
Pia

Pia

India Pakistan: పాకిస్తాన్‌పై భారత్ మరింత ప్రతీకారం తీర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పహల్గామ్ దాడి నేపథ్యంలో ఇప్పటికే భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసుకుంది. పాకిస్తానీయులకు వీసాలను రద్దు చేసింది. అట్టారీ-వాఘా బోర్డర్‌ని మూసేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు మరోసారి పాకిస్తాన్‌కి బిగ్ షాక్ ఇవ్వడానికి భారత్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Read Also: Canada Elections: ఎన్నికల్లో ఓడిపోయిన ఖలిస్తాన్ మద్దతుదారుడు జగ్మీత్ సింగ్..

భారత్ తన గగనతలాన్ని పాకిస్తాన్ విమానాలకు నిషేధించాలని నిర్ణయించినట్లు జాతీయ మీడియా చెబుతోంది. దీంతో పాటు భారత ఓడరేవుల్లోకి పాకిస్తాన్ నౌకలపై నిషేధం విధించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే, భారత్ చర్యలకు ప్రతీకార చర్యగా పాకిస్తాన్ తన గగనతలాన్ని భారత విమానాలకు మూసేసింది. ఇప్పుడు భారత్ కూడా అదే పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల పాకిస్తాన్ ఎయిర్ లైనర్లకు చెందిన విమానాలు చైనా, శ్రీలంక, మలేషియా, సింగపూర్, థాయ్‌లాండ్ వంటి దేశాలకు వెళ్లాలంటే ఇబ్బందులు పడాల్సిందే. పాక్ విమానాలు చైనా, శ్రీలంక మీదుగా సుదూరం ప్రయాణించాల్సి ఉంటుంది.

గత వారం జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌పై ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 26 మంది టూరిస్టులను ముష్కరులు కాల్చి చంపారు. హిందువులుగా నిర్ధారించుకున్న తర్వాత టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ఈ ఘటనపై యావత్ దేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌పై దౌత్య చర్యలు తీసుకుంటోంది. ఈ దాడిలో పాకిస్తాన్ ప్రమేయం ఉన్నట్లు మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఆధారాలు సంపాదించాయి. రెండు దేశాల మధ్య యుద్ధ తరహా వాతావరణ కమ్ము కుంది.