Brahmos: చైనాకు బిగ్ షాక్.. వియత్నాం తర్వాత ఇండోనేషియా చేతుల్లోకి బ్రహ్మోస్..

  • వియత్నాం చేతికి బ్రహ్మోస్ క్షిపణి.
  • తుది దశలో ఇండోనేషియాతో క్షిపణి కొనుగోలు ఒప్పందం.
  • చైనాకు షాక్ ఇస్తున్న భారత రక్షణ అమ్మకాలు.
  • మాక్ 3 వేగంతో దూసుకెళ్లే సత్తా బ్రహ్మోస్ సొంతం.
Brahmos

Brahmos

Brahmos: భారత్ అభివృద్ధి చేసిన ‘‘బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్’’కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ నెలకొంది. పలు దేశాలు ఈ క్షిపణని కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నాయి. తాజాగా వియత్నాంకు బ్రహ్మోస్ అమ్మేందుకు ఒప్పందం కుదిరినట్లు భారత రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. దీనికి ముందు ఫిలిప్పీన్స్ కూడా ఈ క్షిపణిని కొనుగోలు చేసింది. ఇదే సమయంలో ఇండోనేషియాతో కూడా ఒప్పందం తుది దశకు చేరుకున్నట్లు తెలిపారు.

చైనా సమీపంలో ఈ దేశాలు బ్రహ్మోస్ క్షిపణిపై చాలా ఆసక్తి చూపిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే డ్రాగన్ కంట్రీని భారత మిస్సైళ్లతో ఈ దేశాలు టార్గెట్ చేస్తున్నాయి. దక్షిణ చైనా సముద్రం అంతా తనదే అని చైనా వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతున్న సమయంలో ఈ కొనుగోళ్లు జరిగాయి. సింగపూర్‌లో జరుగుతున్న షాంగ్రి-లా డైలాగ్ సమావేశంలో మాట్లాడిన రాజేష్ కుమార్ సింగ్, వియత్నాం ఒప్పందం ఇప్పటికే సంతకం అయ్యిందని, అయితే అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదని పేర్కొన్నారు. ఇండోనేషియాతో చర్చలు కూడా చివరి దశలో ఉన్నాయని చెప్పారు.

×
×
Ad

వియత్నాంతో జరిగిన ఈ ఒప్పందం విలువ రూ. 5800 కోట్లుగా ఉంటుందని సమాచారం. భవిష్యత్తులో వియత్నాం గగనతలం నుంచి ప్రయోగించే బ్రహ్మోస్ వెర్షన్‌ను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. దీనికి ముందు 2022లో ఫిలిప్పీన్స్ దాదాపు 375 మిలియన్ డాలర్లతో బ్రహ్మోస్ క్షిపణుల్ని కొనుగోలు చేసింది. త్వరలో ఇండోనేషియా కూడా ఈ జాబితాలో చేరే అవకాశం ఉంది.

బ్రహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే క్రూయిజ్ మిస్సైళ్లలో ఒకటి. ఇది మాక్ 3(శబ్ధవేగానికి మూడింతల) వేగంతో ప్రయాణించగలదు. భూమి, సముద్రం, ఆకాశం నుంచి ఈ క్షిపణిని ప్రయోగించగలం. అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదిస్తుంది. ఈ డీల్స్‌తో చైనాను నేరుగా భారత్ సవాల్ చేస్తోంది. పాకిస్తాన్‌కు తన ఆయుధాలు ఇచ్చి భారత్‌పై ఆధిపత్యం చూపించాలనే డ్రాగన్ బుద్ధిని, అదే తరహాలో వియత్నాం, ఫిలిప్పీన్స్ దేశాలతో చైనాకు కూడా భారత్ వర్తింప చేస్తోంది.