India Rank: ప్రపంచ దేశాలు రక్షణ వ్యయాన్ని భారీగా పెంచినట్లు స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI) నివేదిక వెల్లడించింది. ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్ ఒకటిగా నిలిచింది. రక్షణ రంగ వ్యయంలో భారత్ ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. 2025లో భారత రక్షణ వ్యయం 92.1 బిలియన్ డాలర్లకు చేరిందని, ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 8.9 శాతం పెరుగుదల అని సిప్రి నివేదిక చెప్పింది.
చైనానే టార్గెట్:
ఇదే సమయంలో భారత్ వద్ద 190 అణ్వాయుధాలు ఉన్నట్లు వెల్లడించింది. పాకిస్తాన్ వద్ద 170 అణ్వాయుధాలు ఉన్నట్లు తెలిపింది. 2025లో భారత్ తన అణు సామర్థ్యాన్ని స్వల్పంగా పెంచుకున్నట్లు చెప్పింది. ఇదే సమయంలో భారత్ కొత్త తరహా అణ్వాయుధ వాహక వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని తెలిపింది. భారత్ ప్రధానంగా చైనాలోని లక్ష్యాలను చేరుకోగల లాంగ్ రేంజ్ క్షిపణుల్ని అభివృద్ధి చేస్తుందని నివేదిక చెప్పింది. పాక్తో కొనసాగున్న ఘర్షణలు కూడా భారత్ రక్షణ ప్రణాళికల్లో వేగాన్ని పెంచుతున్నట్లు వెల్లడించింది. ఇదే సమయంలో పాక్ వచ్చే దశాబ్ధ కాలంలో అణ్వాయుధ నిల్వల్ని మరింత పెంచుకునే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. 2026 ప్రారంభం వరకు అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, భారత్, పాకిస్థాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ కలిపి మొత్తం 12,187 అణ్వాయుధాలను కలిగి ఉన్నట్లు చెప్పింది.
రక్షణ వ్యయంలో 5వ ర్యాంక్:
2025లో అత్యధిక రక్షణ వ్యయం చేసిన దేశాల్లో అమెరికా మొదటిస్థానంలో నిలిచింది. అమెరికా ఏకంగా 954 బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తోంది. రెండో స్థానంలో చైనా 336 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉంది. రష్యా 190 బిలియన్ డాలర్లలో మూడో స్థానంలో, జర్మనీ నాలుగో స్థానంలో, భారత్ 92.1 బిలియన్ డాలర్ల రక్షణ వ్యవంతో ఐదో స్థానంలో ఉంది.

