భారత వాయుసేనలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అస్సాంలో సుఖోయ్ యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు దుర్మరణం చెందారు. ఈ ఘటనపై ఇండియన్ ఎయిర్ఫోర్స్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది.
భారత వాయుసేన విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. వాయుసేనకు చెందిన ఇద్దరు పైలట్లు స్క్వాడ్రన్ లీడర్ అనుజ్, ఫ్లట్ లెఫ్టినెంట్ పూర్వేష్ దురాగ్కర్లు చనిపోయినట్లుగా భారత వైమానిక దళం శుక్రవారం తెలిపింది. యుద్ధ విమానం శిక్షణ మిషన్లో భాగంగా గురువారం రాత్రి టేకాప్ అయిందని.. అయితే రాత్రి 7:42 గంటల సమయంలో రాడార్తో సంబంధం కోల్పోయిందని.. అనంతరం కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో కూలిపోయిందని తెలిపింది. ప్రమాద స్థలం జోర్హాట్ నగరానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ప్రమాదం జరిగిన సమయంలో స్థానికులు భారీ శబ్దం.. పేలుడు విన్నట్లు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రక్షణ బృందాలు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టాయి. ఈ యుద్ధ విమానం రష్యాకు చెందిన సుఖోయ్ సంస్థ రూపొందించింది. ఈ విమానాలను భారతదేశంలో హెచ్ఏఎల్ తయారు చేస్తోంది. ప్రస్తుతం భారత వాయుసేన వద్ద 200కు పైగా Su-30MKI యుద్ధవిమానాలు ఉన్నాయి.
