Mpox: ఎంపాక్స్ వైరస్‌పై జేపీ నడ్డా నేతృత్వంలో అత్యున్నత సమావేశం..

  • ఎంపాక్స్‌పై జేపీ నడ్డా నేతృత్వంలో అత్యున్నత సమావేశం..
  • భారత సంసిద్ధతపై అధికారులతో చర్చ..
  • డీఆర్ కాంగోలో విజృంభిస్తున్న మంకీపాక్స్..
Health Minister Jp Nadda

Health Minister Jp Nadda

Mpox: ఆఫ్రికాలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి తీవ్రమవుతోంది. ఇప్పటికే ఆ దేశంలో ఈ వైరస్ కారణంగా 500కి పైగా మరణాలు, 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే స్వీడన్, పాకిస్తాన్ దేశాల్లో కూడా వ్యాధి నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో భారత్ కూడా హై అలర్ట్‌గా ఉంది. భారత్‌లో ఇప్పటి వరకు కేసులు లేకపోయినప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపత్యంలో దేశ సంసిద్ధను సమీక్షించడానికి ఈ రోజు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా నేతృత్వంలో అత్యున్నత సమావేశం జరిగింది.

Read Also: Delhi Crime: కాబోయే వాడితో కలిసి కన్నతల్లిని హతమార్చిన మహిళ..

జెపి నడ్డా అధ్యక్షతన అధికారులతో సమావేశమై, వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి మరియు నియంత్రించడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భారత్‌లో వ్యాప్తి చెందే ప్రమాదం తక్కువగా ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రోజు జరిగిన సమావేశానికి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC), వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ (NVBDCP), డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నిపుణులు(Dte.GHS) హాజరయ్యారు. సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మునుపు 2022 జూలైలో మంకీపాక్స్‌ను పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ (PHEIC)గా ప్రకటించింది మరియు తరువాత మే 2023లో దానిని ఉపసంహరించుకుంది. 2022లో 116 దేశాల్లో 99,176 కేసులు మరియు 208 మరణాలు నమోదయ్యాయి. ఆ సమయంలో భారత్‌లో 30 కేసులు వెలుగులోకి వచ్చాయి. చివరి కేసు మార్చి 2024లో కనుగొనబడింది. తాజాగా డబ్ల్యూహెచ్ఓ ఈ వారంలో మరోసారి ‘‘గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ’’గా ప్రకటించింది.