IC 814 Hijack: ఐసీ 814 విమానంలో ‘రా’ ఏజెంట్.. ఉగ్రవాదులకు తెలిస్తే ఖచ్చితంగా తలనరికే వారు..

  • 1999 కాందహార్ హైజాక్ ఘటన సమయంలో విమానంలో ‘రా’ ఏజెంట్..
  • చివరి వరకు కూడా అతడు ఉన్న సంగతి గుర్తించని ఐఎస్ఐ..తాలిబాన్లు..
  • ప్రయాణికుల లిస్ట్ వెల్లడించినప్పుడు అతడి పేరు ప్రకటించలేదు..
  • రా ఏజెంట్ గురించి తెలిస్తే ఖచ్చితంగా చంపేసే వారు..
  • ఆనాటి ఘటన విషయాలను పంచుకున్న రా మాజీ చీఫ్ దులత్..
Ic 814 Hijack

Ic 814 Hijack

IC 814 Hijack: ‘‘IC 814: ది కాందహార్ హైజాక్’’ నెట్‌ఫ్లి్క్స్ సిరీస్ మూలంగా మారోసారి 1999లో జరిగిన ఖాట్మాండు-ఢిల్లీ ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం హైజాక్ విషయాన్ని గుర్తు చేసుకున్నాము. ఇప్పుడున్న జనరేషన్ వారికి పెద్దగా దీని గురించి తెలియదు. 8 రోజుల పాటు దేశాన్ని కలవరపరిచిన ఈ హైజాక్ ఉదంతంలో ఆనాటి సంఘటనల్ని అప్పటి అధికారులు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. ఈ ఘటనలో విమానాన్ని అమృత్‌సర్, లాహోర్, దుబాయ్ మీదుగా తాలిబాల్ కంట్రోల్‌లోని ఆఫ్ఘనిస్తాన్ కాందహార్‌కి తీసుకెళ్లారు. ప్రయాణికుల్ని రక్షించేందుకు భారత్ కరుడుగట్టిన ముగ్గురు ఉగ్రవాదుల్ని రిలీజ్ చేయాల్సి వచ్చింది.

Read Also: Rahul Gandhi: ఇండియాకి బద్ధ వ్యతిరేకి, పాక్ మద్దతురాలు.. ఇల్హాన్ ఒమర్‌తో రాహుల్ గాంధీ భేటీ..

ఆనాటి హైజాక్ ఘటనని భారత గూఢచార ఏజెన్సీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) మాజీ చీఫ్ ఏఎస్ దులత్ గుర్తు చేసుకున్నారు. హైజాక్ అయిన విమానంలోనే అప్పటి ఖాట్మాండులోని రా స్టేషన్ చీఫ్ శశి భూషన్ సింగ్ తోమర్ ఉన్న విషయాన్ని చెప్పారు. ఫ్లైట్‌లో 16 సీ సీటులో ఉన్న ప్రయాణికుడి గురించి బయటకు విషయం పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. విమానంలో ఉన్న ప్రయాణికులు పేర్లు వెల్లడించినప్పుడు ఇతడి పేరు వెల్లడించలేదు. విమానం అమృత్‌సర్‌లో ఉన్నప్పుడు రా అధికారి విమానంలో ఉన్న విషయం ప్రభుత్వంలో తెలియదని చెప్పారు. అయితే, తనకు తెలుసని, తాను ఎవరికి చెప్పదలుచుకోలేదని, ప్రచారం చేయాల్సిన అవసరం లేదని చెప్పారు.

రా అధికారి విమానంలో ఉన్న విషయం తాలిబాన్లు, ఐఎస్ఐ‌కి కూడా అస్సలు తెలియదు. తోమర్ ఢిల్లీకి తిరిగి వచ్చే వరకు ఎవరికీ ఏ విషయం తెలియదని చెప్పారు. ఒక వేళ అతడి గురించి తెలిసి ఉంటే మాత్రం అతడి జీవితం ప్రమాదంలో పడేదని దులత్ చెప్పారు. ఒక గూఢచారి విమానంలో ఉన్నాడని తెలిస్తే, ఉగ్రవాదులు అతడి కళ్లకు గంతలు కట్టి, మెడపై కత్తిపెట్టి, ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేవారిని చెప్పారు. అతడి తల నరికేసి ఉండేవారిని చెప్పారు. దులత్ ఢిల్లీకి వచ్చిన తర్వాత ‘‘నేను నిశ్శబ్దంగా కూర్చున్నాను మరియు నేను ఆ కుర్రాళ్ల కళ్లలోకి అస్సలు చూడలేదు.’’ అని చెప్పాడని దులత్ వెల్లడించారు.