Harbhajan Singh: ఆప్‌ నుంచి అందుకే బయటకు వచ్చేశా.. హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు

  • ఆప్‌ను వీడడంపై స్పందించిన హర్భజన్ సింగ్
  • ఆ విషయంలో పట్టించుకోకపోవడం వల్లే వీడినట్లు వెల్లడి
Harbhajan Singh

Harbhajan Singh

ఆమ్ ఆద్మీ పార్టీ వీడడంపై మాజీ క్రికెటర్, రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ స్పందించారు. ఆప్‌ను వీడి బీజేపీలో చేరడానికి గల కారణాలను వీడియాకు వివరించారు. క్రీడలు, పంజాబ్‌లోని మాదకద్రవ్యాల సమస్యపై తన అభిప్రాయాలను పార్టీ పట్టించుకోకపోవడమే ఆమ్ ఆద్మీ పార్టీని వీడటానికి కారణమని పేర్కొన్నారు. తాను తన ప్రణాళికలను పార్టీకి చాలాసార్లు సమర్పించినప్పటికీ.. వాటిపై ఎలాంటి చర్య తీసుకోలేదని వ్యాఖ్యానించారు. ఆప్‌తో ఎలాంటి సమస్య లేదు కానీ.. తన అభిప్రాయాలను పట్టించుకోకపోవడంతోనే వీడినట్లుగా చెప్పుకొచ్చారు. తాను ఆప్‌లో చేరిన ఉద్దేశ్యం నెరవేరకపోవడమే పార్టీని వీడాలని నిర్ణయించుకోవడానికి కారణమని తెలిపారు.

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తనను ఆమ్ ఆద్మీ పార్టీలో చేరమని అడిగినప్పుడు.. రాజ్యసభలో క్రీడలకు సంబంధించిన అంశాలను లేవనెత్తడం గురించి చర్చ జరిగిందని చెప్పారు. ‘‘నేను కేవలం క్రీడల గురించి మాత్రమే మాట్లాడతానని ఆ సమయంలో స్పష్టం చేశాను. రాజకీయాల గురించి చర్చించడం నా పని కాదు. పంజాబ్‌లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా క్రీడలను ప్రోత్సహించే అవకాశం లభించడమే నేను ఆప్‌లో చేరడానికి గల ఏకైక కారణం.’’ అని చెప్పుకొచ్చారు.

హర్భజన్ సింగ్ 2022లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మరో ఆరుగురు పార్టీ ఎంపీలతో కలిసి బీజేపీలో చేరారు. క్రీడలకు సంబంధించి తన ఆలోచనలు, ప్రణాళికలను పార్టీకి తెలియజేయడానికి తాను చాలాసార్లు ప్రయత్నించానని, కానీ తన మాట వినలేదని హర్భజన్ పేర్కొన్నారు.

హర్భజన్ బీజేపీలో చేరిన తర్వాత పార్టీని వీడిన ఎంపీలు ద్రోహం చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. జలంధర్‌లోని హర్భజన్ ఇంటి బయట నిరసనలు జరిగాయి, ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. దీనిపై ప్రశ్నించగా, నిరసనకారులు ఎవరో, వారు ఎక్కడి నుంచి వచ్చారో అందరికీ తెలుసని ఆయన అన్నారు. ‘‘దేశంలోని సామాన్య ప్రజలకు నేను నా క్రికెట్ వల్ల తెలుసు. వారు నాపై ఎంతో ప్రేమను చూపించారు. వారెందుకు నా దిష్టిబొమ్మను తగలబెడతారు లేదా నా ఇంటి బయట ద్రోహి అని రాస్తారు? నేను ఎవరికి ద్రోహం చేశాను?’’ అని ప్రశ్నించారు.