NTV Telugu Site icon

Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదు సర్వేకు అనుమతి ఇచ్చిన వారణాసి కోర్ట్

Gyanvapi Mosque

Gyanvapi Mosque

దేశంలో ప్రముఖంగా ప్రస్తుతం జ్ఞానవాపి మసీదు వివాదం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈరోజు జ్ఞానవాపి మసీదు వివాదంపై వారణాసి హైకోర్ట్ లో విచారణ జరిగింది.  జ్ఞానవాపి మసీదు సర్వేపై కోర్ట్ విచారణ జరిపింది. సర్వే చేయాలని కోర్ట్ కమిషనర్ అజయ్ మిశ్రాతో పాటు మరో ఇద్దరు న్యాయవాదులను కమిషనర్లుగా నియమించింది. కమిషన్ మే 17 లోగా నివేదిక ఇవ్వాలని కోర్ట్ ఆదేశించింది. అయితే ఈ వివాదంపై ఇటు హిందువులు, అటు ముస్లింల తరుపున న్యాయవాదులు వారి వాదనలు వినిపించారు. కోర్ట్ కమిషనర్ ను తొలగించేందుకు కోర్ట్ నిరాకరించింది.

జ్ఞానవాపి మసీదు లోపలి భాగాలను కూడా సర్వే చేయవచ్చా..? అనే పిటిషన్ ను విచారించిన కోర్ట్ మసీదులోని నేలమాళిగలతో పాటు మొత్తం ప్రాంతాన్ని సర్వే చేసి వీడియో చిత్రీకరించాలని తీర్పు చెప్పింది. అజయ్ మిశ్రాతో పాటు రెండో కోర్ట్ కమిషనర్ గా విశాల్ కుమార్ సింగ్ ను కోర్ట్ నియమించింది. కాగా గత  శుక్రవారం కోర్ట నియమించిన కమిటీ మసీదు ప్రాంగణాల్లో సర్వే, వీడియోను తీయకుండా మసీదు అడ్మినిస్ట్రేషన్ కమిటీ సర్వే టీం ను లోపలకి రాకుండా అడ్డుకుంది. నిరసనలు తెలియజేసింది.

మొగల్ చక్రవర్తుల హయాంలో జౌరంగజేబు సమయంలో జ్ఞానవాపి శివాలయాన్ని కూల్చేసి అక్కడ మసీదును నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇందుకు అనుగుణంగానే మసీదు వెనకాల దేవాలయానికి సంబంధించి స్తంబాలు ఉండటంతో హిందువులు దేవాలయాన్ని కూల్చేసి మసీదును నిర్మించారని ఆరోపిస్తున్నారు. కొన్ని హిందూ సంస్థలు మసీదును హిందువులకు అప్పగించాలని కోరుతున్నారు. అంతకుముందు ఢిల్లీకి చెందిన ఐదుగురు మహిళలు జ్ఞానవాపి మసీదు వెలుపల గోడపై హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయని… తమకు పూజ చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరుతూ కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో జ్ఞానవాపి మసీదు వీడియోగ్రఫీకి వారణాసి కోర్ట్ ఆదేశించింది. దీంట్లో భాగంగానే సర్వేను కొనసాగించాలని వారణాసి కోర్ట్ తీర్పు చెప్పింది.