Gurugram: వామ్మో ఇదేం జాడ్యం.. హిట్ అండ్ రన్ కేసులో నిందితుడికి మద్దతుగా కార్ల ర్యాలీ

  • గురుగ్రామ్ హిట్ అండ్ రన్ కేసులో షాకింగ్ ఘటన
  • నిందితుడికి మద్దతుగా పలువురు కార్ల ర్యాలీ
  • ‘గుర్జర్ ఏక్తా’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు!
Gurugram

Gurugram

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గురుగ్రామ్ హిట్ అండ్ రన్ కేసులో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కల్యాణ్ బైన్‌స్లాకు మద్దతుగా పెద్ద ఎత్తున కార్ల ర్యాలీ నిర్వహించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. శుక్రవారం పలువురు గురుగ్రామ్‌లోని ఫ్లైఓవర్‌పై ర్యాలీగా వెళ్లారు. అంతేకాకుండా కల్యాణ్‌కు మద్దతుగా నినాదాలు కూడా చేశారు. కల్యాణ్ గుర్జర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కావడంతో ‘గుర్జర్ ఏక్తా’ అంటూ నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నిందితుడికి మద్దతుగా మహాపంచాయత్ నిర్వహించనున్నట్లు కూడా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వెలువడ్డాయి. దీంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

“కళ్యాణ్ బైన్‌స్లాకు పూర్తి మద్దతు” అంటూ ఓ పోస్టు పెట్టగా.. మరో పోస్టులో “గుర్జర్లను ఎంతగా రెచ్చగొడితే.. అంతగా ఐక్యమవుతాం. ఇది గుండాగిరి కాదు.. గుర్జర్ ఏక్తా” అంటూ పేర్కొన్నారు. ‘జస్టిస్ ఫర్ కళ్యాణ్ బైన్‌స్లా’, ‘గుర్జర్ ఏక్తా జిందాబాద్’ వంటి నినాదాలు చక్కర్లు కొడుతున్నాయి.

హిట్ అండ్ రన్ ఘటనలో బాధితురాలైన సియా తండ్రి రోషన్ చౌహాన్ మహాపంచాయత్ వార్తలపై స్పందించారు. ఈ ఘటన ఏదైనా ఒక కమ్యూనిటీకి సంబంధించిన పోరాటం కాదని.. ఇది నేరానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటమని అన్నారు. నిందితుడు ఏ కమ్యూనిటీకి చెందినవాడైనా పరిస్థితి మారదని, “నేరస్థుడికి కులం ఉండదు” అని వ్యాఖ్యానించారు. మహాపంచాయత్‌ను ఏ అంశంపై నిర్వహిస్తున్నారో తనకు తెలియదని తెలిపారు.

సెప్టెంబర్ 13న గురుగ్రామ్‌లో గోల్ఫ్ కోర్స్ రోడ్‌పై సియా అనే యువతి బైక్‌పై వెళ్తుండగా కల్యాణ్ అనే యువకుడు కారుతో ఢీకొట్టి పరారయ్యాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడితో పాటు అతని సహచరుడు శ్రీకాంత్ కూడా కారులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడు లవ్నిష్.. సియాను వెంబడించమని కల్యాణ్‌ను ప్రేరేపించాడని, ఘర్షణ సమయంలో ఆమెను దూషించాడని ఆరోపణలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సియాను సుమారు రెండు కిలోమీటర్ల మేర వెంబడించినట్లు చెప్పారు.

బాధితురాలు ఆవేదన

కమ్యూనిటీ, ప్రాంతం, రాష్ట్రానికి సంబంధించిన అంశంగా మార్చడం తనకు అర్థం కావడం లేదని బాధితురాలు సియా అన్నారు. మహాపంచాయత్ నిర్వహణ వెనుక అసలు ఉద్దేశం కథనాన్ని మార్చే ప్రయత్నంగా అనిపిస్తోందని పేర్కొన్నారు. “రోడ్డుపై నాకు జరిగిన తప్పు ఎవరికైనా జరగొచ్చు” అని ఆమె అన్నారు. ఈ ఘటనలో బాధితురాలి లింగం కూడా ప్రధాన అంశం కాదని, ఎవరైనా రోడ్డుపై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడవచ్చని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకే తాను పోరాడుతున్నానని చెప్పారు. ఘటన జరిగిన సమయంలో తనకు నిందితుడి పేరు, అతని కమ్యూనిటీ లేదా కులం ఏదీ తెలియదని సియా పేర్కొన్నారు. ఈ కేసుకు కులం, కమ్యూనిటీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. “ఇవాళ కఠిన చర్యలు తీసుకోకపోతే.. రోడ్డుపై ఇతరులను చంపే పరిస్థితుల్లో ఉన్నవారిని స్వేచ్ఛగా వదిలేసినట్టే అవుతుంది” అని సియా అన్నారు.