ప్రస్తుతం భారత్లోనూ.. అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ కష్టాలు ప్రజలను ముప్ప తిప్పలు పెడుతున్నాయి. దీంతో ఆయా దేశాల్లో పొదుపు మంత్రం పాటిస్తున్నారు. ఇప్పుడు భారత్లో కూడా ప్రధాని దగ్గర నుంచి పౌరులంతా పొదుపు మంత్రం పాటిస్తున్నారు. ఇలాంటి తరుణంలో గుజరాత్లోని ఓ జానపద గాయకుడిపై లక్షల రూపాయల నోట్లు కుమ్మరించడం వివాదాస్పదమవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జునాగఢ్ జిల్లా ఖంభాలియా గ్రామంలో సంప్రదాయ ‘డైరో’ కార్యక్రమం జరిగింది. డైరో అనేది గుజరాత్లో సంగీతం, కథలు, హాస్యాన్ని మేళవించి నిర్వహించే ప్రత్యేక జానపద కార్యక్రమం. ఈ కార్యక్రమంలో గాయకుడు గోపాల్ సాధు హార్మోనియం వాయిస్తూ పాటలు పాడుతుండగా భక్తులు పరవసించిపోయారు. ఇంకేముంది.. బ్యాగుల నిండా భారీగా నోట్ల కట్టలను తీసుకొచ్చి కుమ్మరించారు. సంచుల్లో తీసుకొచ్చిన డబ్బును వేదికపైనే కుమ్మరించడంతో గోపాల్ సాధు దాదాపు నోట్ల కుప్పలో కనిపించకుండా పోయారు. అయినప్పటికీ ఆయన మాత్రం ఏ మాత్రం ఆగకుండా తన గానం కొనసాగించారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇదే అసలు వర్క్ ఫ్రం హోమ్.. కూర్చొని నోట్ల వర్షంలో తడుస్తున్నారు” అంటూ ఒకరు కామెంట్ చేయగా.. “అంత డబ్బు మధ్యలో కూడా ప్రశాంతంగా పాడుతున్నారు” అంటూ మరొకరు స్పందించారు. ఇంకొందరు ఈ డబ్బును పేదల సంక్షేమానికి వినియోగించాలని సూచించారు.
ఇదే తరహా ఘటనలు గుజరాత్లో గతంలో కూడా చోటుచేసుకున్నాయి. 2023లో వల్సాద్లో నిర్వహించిన భజన కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు కీర్తిదాన్ గడ్వీపై కూడా రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్ల వర్షం కురిసింది. అలాగే 2022లో నవ్సారీలో జరిగిన మరో కార్యక్రమంలో ఆయనపై సుమారు రూ.50 లక్షల విలువైన నోట్లను భక్తులు కురిపించారు.
గుజరాత్లో జానపద సంగీత కార్యక్రమాల్లో గాయకులపై నగదు నోట్ల వర్షం కురిపించడం సాధారణమేనని స్థానికులు చెబుతున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా వచ్చిన మొత్తాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించే సంప్రదాయం కూడా ఉందని సమాచారం.
