IRCTC: భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మెయిల్ మరియు ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల కోసం ‘ఈ-ప్యాంట్రీ’ సేవను ప్రారంభించింది. ఈ సేవ ద్వారా ప్రయాణికులు తమ సీట్లను వదిలి వెళ్లే అవసరం లేకుండానే.. వారి బర్త్ దగ్గరకే శుభ్రమైన, వేడి ఆహారం మరియు ప్యాకేజ్డ్ వాటర్ను ముందుగానే బుక్ చేసుకుని పొందవచ్చు. ఇంతకుముందు ఆన్లైన్ ఫుడ్ బుకింగ్ సౌకర్యం ప్రీమియం రైళ్లకే పరిమితమై ఉండగా, తాజాగా ఈ సేవను 25 మెయిల్ మరియు ఎక్స్ప్రెస్ రైళ్లకు విస్తరించారు. టికెట్లో భోజనం చేర్చబడని రైళ్లలో ప్రయాణించే వారికి ఈ సేవ ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.
ఈ-ప్యాంట్రీ సేవ ఎలా పనిచేస్తుంది?
ఈ-ప్యాంట్రీ సేవ IRCTC వెబ్సైట్ మరియు మొబైల్ యాప్తో అనుసంధానించబడి ఉంటుంది. ధృవీకరించబడిన (Confirmed), RAC లేదా పాక్షికంగా ధృవీకరించబడిన టిక్కెట్లు ఉన్న ప్రయాణికులు బుకింగ్ సమయంలో లేదా తరువాత “Book Ticket History” విభాగంలోకి వెళ్లి ప్రామాణిక భోజనం లేదా ‘రైల్ నీర్’ ప్యాకేజ్డ్ వాటర్ను ముందస్తుగా ఆర్డర్ చేయవచ్చు. ఆర్డర్ చేసిన తర్వాత ప్రయాణికులకు SMS లేదా ఇమెయిల్ ద్వారా నిర్ధారణ సందేశంతో పాటు Meal Verification Code (MVC) పంపబడుతుంది. ప్రయాణ రోజున రైలులో ఉన్న విక్రేతకు ఈ MVC చూపిస్తే, ఆహారం నేరుగా ప్రయాణికుల సీటుకు డెలివరీ చేయబడుతుంది.
ఈ రైళ్లలో ఈ-ప్యాంట్రీ సేవ అందుబాటులో ఉంది
ప్రయోగాత్మకంగా వివేక్ ఎక్స్ప్రెస్ (22503/04)లో ప్రారంభించిన ఈ సేవకు మంచి స్పందన లభించడంతో ఇప్పుడు పలు రైళ్లకు విస్తరించారు.
ముఖ్యమైన రైళ్లు ఇవే:
– స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్
– స్వర్ణజయంతి ఎక్స్ప్రెస్
– కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్
– మంగళ ఐలాండ్ ఎక్స్ప్రెస్
– కళింగ ఉత్కళ్ ఎక్స్ప్రెస్
– పుష్పక్ ఎక్స్ప్రెస్
– పశ్చిమ్ ఎక్స్ప్రెస్
– నేత్రావతి ఎక్స్ప్రెస్
– గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్
– పూర్వ ఎక్స్ప్రెస్
– లిచ్చవి ఎక్స్ప్రెస్
– ఆజాద్ హింద్ ఎక్స్ప్రెస్
– మాల్వా ఎక్స్ప్రెస్
– అహ్మదాబాద్–బరౌని ఎక్స్ప్రెస్
– పురుషోత్తం ఎక్స్ప్రెస్ సహా మరిన్ని రైళ్లలో ప్రయాణికులకు ఇది ఉపయోగం కానుంది..
ఇక, క్యాటరింగ్ సౌకర్యం లేని రైళ్లలో ప్రయాణించే వారికి ఈ-ప్యాంట్రీ సేవ ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది. ప్రయాణ సమయంలో ఆహారం కోసం ఆందోళన పడకుండా, పరిశుభ్రమైన భోజనం పొందే అవకాశం కల్పిస్తుందని IRCTC తెలిపింది. ప్రయాణికుల స్పందనను బట్టి ఈ సేవను భవిష్యత్తులో మరిన్ని రైళ్లకు విస్తరించనున్నట్లు అధికారులు వెల్లడించారు.