Site icon NTV Telugu

Gautam Adani: అంబానీని దాటేసిన అదానీ.. దేశంలో టాప్-1 ధనవంతుడిగా స్థానం..

Gautam Adani

Gautam Adani

Gautam Adani: గౌతమ్ అదానీ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని అధిగమించి అగ్రస్థానంలో నిలిచారు. 2024 హూరన్ ఇండియా రిచ్ లిస్టులో గౌతమ్ అదానీ అతడి కుటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ. 11.6 లక్షల కోట్లుగా ఉంది. 2020లో అదానీ నాలుగో స్థానంలో ఉన్నారు. గతేడాది కాలంలోనే అంబానీ సంపద విలువ 95 శాతం పెరిగింది. హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత అదానీ కోలుకున్నారు. హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత అదానీ వ్యాపారాలు ఒడిదొడుకులకు లోనైప్పటికీ ఫినిక్స్ పక్షిలా ఎగురుతూ ఈ ఏడాది ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచారని హూరన్ వెల్లడించింది.

గతేడాదితో పోలిస్తే సంపదలో 95 శాతం పెరుగదలతో రూ.1,161,800 కోట్లకు చేరుకుంది. టాప్-10 జాబితాను పరిశీలిస్తే అదానీ గత 5 ఏళ్లలో అత్యధిక సంపద వృద్ధిని నమోదు చేశారు. గతేడాది అన్ని అదానీ గ్రూపు కంపెనీల షేర్ల ధరలలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. కొత్త పోర్టులు, కంటైనర్ టెర్మినల్స్ కొనుగోలు కారణంగా అదానీ పోర్ట్స్ 98 శాతం పెరుగుదలను చూసింది. అదానీ ఎనర్జీ, అదానీ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్ మరియు అదానీ పవర్-షేరు ధరలో సగటున 76% వృద్ధిని సాధించింది. MSCI తన ఆగస్టు 2024 సమీక్షలో అదానీ గ్రూప్ సెక్యూరిటీలపై పరిమితులను ఎత్తివేయాలని నిర్ణయించడంతో సాధారణ ఆపరేషన్స్ సాధ్యమయ్యాయి.

Read Also: Reliance AGM 2024: ముఖేష్ అంబానీ భారీ ప్రకటన.. ఇక నుంచి ఒక్కరూపాయికే….?

10.14 లక్షల కోట్ల సంపదతో అంబానీ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. దేశంలో బిలియనీర్ల సంఖ్య రికార్డు స్థాయిలో 334కి చేరుకుంది. హురున్ ఇండియా వ్యవస్థాపకుడు మరియు ప్రధాన పరిశోధకుడు అనస్ రెహమాన్ జునైద్ మాట్లాడుతూ.. ‘‘భారత్ ఆసియా సంపద సృష్టి ఇంజిన్‌గా అభివృద్ధి చెందుతోంది’’ అని అన్నారు. ఇదే సమయంలో చైనా బిలియనీర్ల సంఖ్య 25 శాతం క్షీణించింది. భారతదేశంలో 29 శాతం పెరుగుదల కనిపించింది.

జాబితాలో అదానీ, అంబానీ తర్వాత హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత శివనాడార్ అతని కుటుంబం రూ. 3.14 లక్షల కోట్ల సంపదతో మూడో స్థానంలో ఉన్నారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత సైరస్ ఎస్ పూనావాలా(2.89 లక్షల కోట్లు) 4వ స్థానంలో, సన్ ఫార్మా అధినేత దిలీప్ సింఘ్వీ (2.39 లక్షల కోట్లు)తో 5వ స్థానంలో ఉన్నారు. గత ఏడాదిలో ప్రతీ ఐదురోజులకు దేశంలో ఒక బిలియనీర్ పుట్టుకొస్తున్నట్లు నివేదిక తెలిపింది. 1,500 కంటే ఎక్కువ మంది వ్యక్తులు రూ.1,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ నికర విలువను కలిగి ఉన్నారు. ఏడేళ్ల క్రితంతో పోలిస్తే ఇది 150% వృద్ధిని చూపుతుందని బిజినెస్ టుడే నివేదించింది. ఈసారి, జాబితా 1,539 అల్ట్రా-రిచ్ వ్యక్తులను గుర్తించింది, గత సంవత్సరంతో పోలిస్తే 220 మంది గణనీయంగా పెరిగారు.

Exit mobile version