Ganesh Chaturthi 2026: వినాయక చవిత వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.. గణపతికి ఇష్టమైన పత్రితో పాటు.. ఆయన మెచ్చే ఆహారాన్ని కూడా భక్తులు భక్తితో సమర్పిస్తున్నారు.. ఈ సమయంలో మహారాష్ట్రలోని నాసిక్లో ఓ స్వీట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కిలో రూ.27,000 ధర ఉన్న ‘గోల్డెన్ మోదక్’ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నాసిక్లోని విద్యా వికాస్ సర్కిల్ వద్ద ఉన్న సాగర్ స్వీట్స్ ఈ ప్రత్యేక మోదక్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
కిలో రూ.27 వేలు.. బంగారు పూతతో మోదక్
మోదక్ అంటేనే గణపతికి ఇష్టమైన ప్రసాదంగా భక్తులు భావిస్తారు. దీంతో వినాయక చవితి సమయంలో దేశవ్యాప్తంగా స్వీట్ షాపుల్లో మోదక్లకు ప్రత్యేక డిమాండ్ ఉంటుంది. ఈసారి నాసిక్లోని సాగర్ స్వీట్స్ సంప్రదాయ మోదక్కు విలాసవంతమైన రూపాన్ని తీసుకొచ్చింది. ఈ మోదక్పై తినడానికి అనుకూలంగా ఉండే బంగారు పూత (Edible Gold)ను పూశారు. దీంతో సాధారణ మోదక్ కాస్తా ‘గోల్డెన్ మోదక్’గా మారింది. కిలోకు రూ.27,000 ధర నిర్ణయించడంతో ఈ స్వీట్ ప్రత్యేకంగా నిలిచింది. గోల్డెన్ మోదక్కు సంబంధించిన వార్తలు, దృశ్యాలు వైరల్ కావడంతో షాపు వద్దకు పలువురు కస్టమర్లు, ఆసక్తిగల ప్రజలు వస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఘనంగా గణేశ్ చతుర్థి
విఘ్నాలను తొలగించే దేవుడిగా భావించే శ్రీ గణేశుడి జన్మదినాన్ని పురస్కరించుకుని గణేశ్ చతుర్థిని దేశవ్యాప్తంగా భక్తులు ఘనంగా జరుపుకుంటారు. మహారాష్ట్రలో ఈ వేడుకలు ఎంతో ప్రసిద్ధి చెందగా.. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఇటీవలి కాలంలో వేడుకల ప్రాచుర్యం గణనీయంగా పెరిగింది. గణేశ్ చతుర్థి సాధారణంగా బహుళ రోజుల పాటు కొనసాగుతుంది. భక్తులు మట్టి గణేశ్ విగ్రహాలను ఇళ్లకు తీసుకొచ్చి లేదా మండపాల్లో ప్రతిష్ఠిస్తారు. పూజారులు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించిన అనంతరం ప్రతిరోజూ పూజలు, హారతులు నిర్వహిస్తారు.
నిమజ్జనంతో ముగింపు
పలు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న గణనాథుడి ఉత్సవాలు చివర్లో నిమజ్జనంతో ముగుస్తాయి. ఈ సందర్భంగా భక్తులు గణేశుడి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్తారు. సంప్రదాయ డప్పు వాయిద్యాలు, భక్తుల నినాదాల మధ్య సమీపంలోని నీటి వనరుల్లో విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. ఈ కార్యక్రమం గణపతికి వీడ్కోలు పలికే సంప్రదాయంగా కొనసాగుతోంది.

