కర్ణాటకలో బుధవారం కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నేత, దళిత నాయకుడు జి.పరమేశ్వరకు లక్కీ ఛాన్స్ లభించినట్లు తెలుస్తోంది. రేపు ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంలో పరమేశ్వరకు డిప్యూటీ సీఎం పోస్ట్ దక్కబోతున్నట్లుగా వర్గాలు చెబుతున్నాయి. డీకే.శివకుమార్ ముఖ్యమంత్రిగా… పలువురు డిప్యూటీ సీఎం పోస్ట్లు ఉంటాయని ప్రచారం జరిగినా.. చివరికి పరమేశ్వర ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉంటారని అధిష్టానం తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. పరమేశ్వర ఒక్కరే డిప్యూటీ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారని తెలుస్తోంది. అయితే మరోవైపు మరికొందరు నేతలు ఒకటి కంటే ఎక్కువ మంది డిప్యూటీ సీఎంలను నియమించాలని అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. అయినప్పటికీ ప్రస్తుతం పరమేశ్వర పేరుపైనే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో జరిగిన సమావేశాల్లో కొత్త మంత్రివర్గ కూర్పుపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు 12 మంది మంత్రుల ఎంపిక పూర్తైనట్లు సమాచారం. కర్ణాటక కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి నియామకం, రాజ్యసభ, శాసన మండలి స్థానాల భర్తీ వంటి అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.
కొత్త మంత్రివర్గంలో డీకే శివకుమార్తో పాటు కనీసం 12 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రుల జాబితాపై తుది ఆమోదం కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీలోనే ఇవ్వనుంది. ఈ అంశంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో మరో కీలక సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి కేసీ. వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలా తదితర సీనియర్ నేతలు హాజరుకానున్నారు.
మరోవైపు డీకే శివకుమార్ తన రాజకీయ ప్రస్థానంలో గాంధీ కుటుంబం పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ముఖ్యంగా రాజీవ్ గాంధీ తనలోని సామర్థ్యాన్ని ముందుగానే గుర్తించి ప్రోత్సహించారని సోషల్ మీడియా వేదిక ఎక్స్లో పేర్కొన్నారు. ఆయన ప్రోత్సాహమే ప్రజాసేవలో మరింత ముందుకు సాగేందుకు తనకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని తెలిపారు.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడేళ్లు పూర్తైన తర్వాత నాయకత్వ మార్పు జరుగుతోంది. గత కొంతకాలంగా సీఎం మార్పుపై ఊహాగానాలు వస్తున్నాయి. చివరకు సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్ను సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. ఇప్పుడు పరమేశ్వరకు డిప్యూటీ సీఎం పదవి దక్కనున్నట్లు వార్తలు రావడంతో కొత్త ప్రభుత్వంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
