PM Modi: ‘‘ఇకపై మన నీరు మన కోసమే ప్రవహిస్తుంది, మన కోసమే ఆగిపోతుంది’’.. పాక్‌కి మోడీ బిగ్ మెసేజ్..

  • ఇకపై మన నీరు మనకే, మన కోసమే ఆగుతుంది..
  • సింధు జలాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు..
  • దాయాది పాకిస్తాన్‌కి బిగ్ మెసేజ్..
Pm Modi Warning

Pm Modi Warning

PM Modi: ప్రధాని నరేంద్రమోడీ పాకిస్తాన్‌కి బిగ్ మెసేజ్ పంపించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగిన విషయం తెలిసింది. మంగళవారం, సాయంత్రం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ పరోక్షంగా పాకిస్తాన్‌ని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇకపై భారతదేశ నీరు భారత్ కోసమే ప్రవహిస్తుంది. భారతదేశం కోసమే ఆగిపోతుంది, భారతదేశానికి మాత్రమే ఉపయోగిపడుతుంది’’ అని అన్నారు.

‘‘ఈరోజుల్లో మీడియాలో నీటి గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. గతంలో, భారతదేశ హక్కుగా ఉన్న నీరు కూడా భారతదేశం బయటకు ప్రవహించేంది. ఇప్పుడు భారత్ నీరు భారత ప్రయోజనాల కోసమే ప్రవహిస్తుంది, వినియోగించబడుతుంది, భారతదేశ పురోగతికి ఉపయోగపడుతుంది’’ అని అన్నారు.

జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌తో ఉన్న ‘‘సింధు జలాల ఒప్పందాన్ని’’ భారత్ నిలిపేసింది. సింధు, దాని ఉపనదులు పాకిస్తాన్‌కి జీవనాడి లాంటివి. మొత్తం దేశంలో 80 శాతం ప్రజలకు ఈ జలాలే జీవనాధారం. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంతో పాకిస్తాన్ కంగారుపడుతోంది. 1961లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో జరిగిన ఇండస్ వాటర్ ట్రిటీ లో భారత్ తనకు వచ్చిన వాటా కన్నా తక్కువ వాటానే వినియోగించుకుంటోంది. అయితే, ఇప్పుడు ఈ ఒప్పందాన్ని భారత్ నిలిపేయడంతో సింధు నది, దాని ఉపనదులపై భారత్ ప్రాజెక్టులు నిర్మించుకోవడానికి అవకాశం ఏర్పడింది. మరోవైపు, చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ డ్యాం గేట్లను భారత్ మూసేసింది.

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశం తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసింది. సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతు ఇచ్చినంత కాలం ఈ ఒప్పందం నిలిపివేయబడుతుందని స్పష్టం చేసింది.