Kalita Majhi: ఇళ్లలో పనిమనిషి నుండి ఎమ్మెల్యేగా ఎదిగిన కలితా మాజీ.. ఈమె ఎవరు?

  • ఇళ్లలో పనిమనిషి నుండి ఎమ్మెల్యేగా ఎదిగిన కలితా మాజీ
  • ఔష్‌గ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ విజయం
  • తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన శ్యామ ప్రసన్న లోహర్‌పై 12,535 ఓట్ల తేడాతో విజయం
Kalita Majhi

Kalita Majhi

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. సోమవారం (మే 4, 2026) ప్రకటించిన ఫలితాల్లో, భారతీయ జనతా పార్టీ 294 స్థానాలకు గాను 206 స్థానాలను గెలుచుకుంది. కాగా, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) 80 స్థానాలకే పరిమితమైంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ మహిళ సాధించిన విజయం గురించి దేశ నలువైపులా చర్చ జరుగుతోంది. ఆమె ఎవరో కాదు కుటుంబ పోషణ కోసం ఇళ్లల్లో పనిమనిషిగా పనిచేసే కలితా మాజీ. ఆమె ఔష్‌గ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ విజయం సాధించారు.

ఔష్‌గ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున కలితా మాజీని నామినేట్ చేయగా, ప్రజలు ఆమెపై విశ్వాసం వ్యక్తం చేశారు. ఔష్‌గ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం బోల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఒక భాగం. పుర్బా బర్ధమాన్ జిల్లాలోని ఔష్‌గ్రామ్ లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ నియోజకవర్గంలో కమలం వికసించడం ఇదే తొలిసారి. బీజేపీ అభ్యర్థి కలితా మాఝీ తన ప్రత్యర్థి తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన శ్యామ ప్రసన్న లోహర్‌పై 12,535 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కలితా మాజీ 107,692 ఓట్లు సాధించి, టీఎంసీకి చెందిన శ్యామా ప్రసన్న లోహర్‌ను 12,535 ఓట్ల తేడాతో ఓడించారు. ఆమె కష్టానికి ప్రతిఫలం దక్కింది.

కలితా మాజీ ఎవరు?

కలితా మాజీ గుస్కారా మున్సిపాలిటీ నివాసి. రాజకీయాల్లోకి రాకముందు మూడు నాలుగు ఇళ్లలో పనిమనిషిగా పనిచేశారు. క్షేత్రస్థాయిలో ఆమెకున్న సంబంధాలు ఎన్నికల్లో ఆమె అభ్యర్థిత్వాన్ని చర్చనీయాంశం చేశాయి. ఆమె నెలకు సుమారు మూడు నాలుగు వేల రూపాయలు సంపాదిస్తూ, ఆ ఆదాయంతో తన కుటుంబాన్ని పోషిస్తున్నారు.

గుస్కారా మున్సిపాలిటీలోని 3వ వార్డు, మఝ్‌పుకుర్ పార్ నివాసి అయిన కలితా, తన భర్త సుబ్రతా మాజీతో కలిసి నివసిస్తున్నారు. విద్యా వ్యవస్థ అవినీతితో నిండిపోయిందని మాజీ అంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలు అధ్వాన్న స్థితిలో ఉన్నాయి. “భవిష్యత్ తరాలను తీర్చిదిద్దేది పాఠశాలలే కాబట్టి, నేను వాటిపై దృష్టి పెడతాను. రైతుల సమస్యలను కూడా పరిష్కరిస్తాను,” అని ఆమె తెలిపారు.

కలితా మాజీ గతంలో 2021 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేశారు. అయితే, ఆమె తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి అభేదానంద థండర్ చేతిలో 11,815 ఓట్ల తేడాతో ఓడిపోయారు. భారతీయ జనతా పార్టీ ఆమెను 2026 అసెంబ్లీ ఎన్నికలకు తిరిగి నామినేట్ చేసింది. ఈ నిర్ణయం, కలితాకు స్థానికంగా ఉన్న పలుకుబడిపై పార్టీకి ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది.