Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం

  • సియా గోయల్ కు సంబంధించి మరో కీలక పరిణామం
  • దుకాణంపై FDA ఆకస్మిక తనిఖీలు
  • కుటుంబంపై పెరుగుతున్న ఒత్తిడి
Siya Goyal

Siya Goyal

పూణెలో సంచలనం సృష్టించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్ కు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర ఆహార, ఔషధ అడ్మినిస్ట్రేషన్ (FDA) సియా గోయల్ కుటుంబం నిర్వహిస్తున్న మసాలా దినుసులు, డ్రై ఫ్రూట్స్ దుకాణంపై తనిఖీలు నిర్వహించి, తీవ్ర నిబంధనల ఉల్లంఘనలను గుర్తించింది. అనంతరం దుకాణాన్ని తక్షణమే మూసివేయాలని ఆదేశిస్తూ నోటీసు జారీ చేసింది.

దుకాణంపై FDA ఆకస్మిక తనిఖీలు

అధికారుల సమాచారం ప్రకారం, ‘మెస్సర్స్ బి.జి. గోయల్ అండ్ కంపెనీ’ పేరుతో నిర్వహిస్తున్న దుకాణంలో FDA అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ‘సంత్’, ‘సాధు’ బ్రాండ్లకు చెందిన పసుపు పొడి, నువ్వులు, సోయాబీన్ నమూనాలను సేకరించారు. తనిఖీల్లో ఉత్పత్తుల లేబులింగ్‌లో పలు లోపాలు గుర్తించిన అధికారులు, కల్తీ జరిగి ఉండొచ్చనే అనుమానంతో సుమారు 4,172 కిలోల ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.8.14 లక్షలుగా అంచనా వేశారు.

దుకాణం మూసివేయాలని ఆదేశాలు

ఆహార భద్రత, ప్రమాణాల చట్టం (Food Safety and Standards Act) ప్రకారం, దుకాణాన్ని వెంటనే మూసివేయాలని FDA నోటీసు జారీ చేసింది. దుకాణానికి సంబంధించిన లైసెన్స్‌లో అవసరమైన సవరణలు చేయకపోవడం కూడా ఈ చర్యకు ప్రధాన కారణంగా అధికారులు పేర్కొన్నారు.

కుటుంబంపై పెరుగుతున్న ఒత్తిడి

కేతన్ అగర్వాల్ హత్య కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత సియా గోయల్ కుటుంబం ఇప్పటికే సామాజిక, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇప్పుడు FDA చర్యలతో పాటు దుకాణం మూసివేయాల్సి రావడంతో ఆ కుటుంబంపై ఆర్థిక భారం కూడా పెరిగినట్లు తెలుస్తోంది. ఈ కేసులో సియా గోయల్, ఆమెతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న చేతన్ చౌదరిని జూలై 3న కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. ఆ కస్టడీ గడువు జూలై 16తో ముగియనుంది. కాగా, వీరిని మరింత పోలీసు కస్టడీకి ఇవ్వాలన్న ప్రాసిక్యూషన్ అభ్యర్థనను కోర్టు ఇప్పటికే తిరస్కరించింది.

కేతన్ అగర్వాల్ హత్య కేసు ఏమిటి?

జూన్ 18న పూణె జిల్లాలోని లోహగడ్ కోట వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల ఆరోపణల ప్రకారం, సియా గోయల్, ఆమె ప్రియుడిగా భావిస్తున్న చేతన్ చౌదరి కలిసి సియా కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను లోయలోకి తోసేయడంతో అతను మృతి చెందాడు. దర్యాప్తు సందర్భంగా నిందితుల మొబైల్ ఫోన్‌ల నుంచి స్వాధీనం చేసుకున్న కోడెడ్ సంభాషణలు కేసులో కీలక ఆధారాలుగా మారినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.