Maharashtra: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇటీవల ఉద్ధవ్ ఠాక్రే ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసిన సందర్భంలో, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు. నిన్నటి వరకు ప్రత్యర్థులుగా ఉన్న వారి మధ్య పరిస్థితులు చల్లబడినట్లు కనిపిస్తోంది. దీంతో మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారబోతుందా? అనే చర్చ నడుస్తోంది. శివసేన (యూబీటీ ) చీఫ్గా ఉన్న ఠాక్రేపై ఫడ్నవీస్ ప్రశంసల వ్యవహారం, ఏక్నాథ్ షిండే శివసేనకు ప్రమాద ఘంటికలుగా పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు.
ఠాక్రేపై ఫడ్నవీస్ పొగడ్తలు:
లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఫడ్నవీస్ మాట్లాడుతూ.. కోవిడ్ సమయంలో రాష్ట్రాన్ని సమర్థంగా నడిపించారని, రాజకీయాల్లో ఆయన ప్రవర్తన హుందాగా ఉంటుందని, అదే సమయంలో 2019లో బీజేపీ-శివసేన విడిపోయిన వ్యవహారాన్ని ఒక కవిత రూపంగా చెప్పారు. ‘‘నా చేతి పట్టుకుని నడవాల్సిన వారే, కొన్ని మాటలు పట్టుకుని ఆగిపోయారు’’ అంటూ ఫడ్నవీస్ అన్నారు. దీనికి కౌంటర్గా ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. ‘‘ మరీ మీరు వేరొకరి చేయి పట్టుకోవాల్సిన అవసరం అంతగా ఏమొచ్చింది?’’ అని ప్రశ్నించారు. ఇద్దరి మధ్య ఈ మాటల మార్పిడి మహా రాజకీయాల్లో సంచలనంగా మారింది.
రహస్య భేటీ:
ఇటీవల ఉద్ధవ్, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే సీఎం ఫడ్నవీస్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శివసేన యూబీటీ ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించే విషయంపై చర్చించారు. మరోవైపు, ఇటీవల మహారాష్ట్ర మత స్వేచ్చా బిల్లుపై జరిగిన ఓటింగ్లో కాంగ్రెస్, ఎన్సీపీ విభేదించినా, ఉద్ధవ్ వర్గం ప్రభుత్వానికి మద్దతు తెలిపింది. ప్రతిపక్ష నాయకుడి పదవి విషయంలో కాంగ్రెస్, ఎన్సీపీలకు చెప్పకుండా ఉద్ధవ్ ఠాక్రే స్పీకర్తో భేటీ అవ్వడం కూడా చర్చనీయాంశంగా మారింది.
షిండేకు చెక్:
ఇవన్నీ పరిణామాలును చూస్తే శివసేన బీజేపీకి దగ్గరవుతున్న వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు, కాంగ్రెస్-ఎన్సీపీ(శరద్ పవార్) కూటమికి దూరమవుతున్నట్లు స్పష్టమవుతుంది. ఇదే సమయంలో బీజేపీతో పొత్తులో ఉన్న ఏక్నాథ్ షిండేకు చెక్ పెట్టాలని బీజేపీ భావిస్తోంది. ఇటీవల సతారా స్థానిక ఎన్నికల విషయంలో షిండే, బీజేపీ మధ్య విభేదాలు తలెత్తాయి. మరోవైపు, ఠాక్రే శివసేన తన అస్తిత్వం కోసం ప్రయత్నిస్తోంది. హిందుత్వ అంశాలపై బీజేపీకి దగ్గరవ్వాలని చూస్తోంది.