ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. కేబినెట్ భేటీ తర్వాత మీడియా సమావేశంలో అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా దాదాపు 51 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. EPF పరిమితి పెంపుతో ప్రభుత్వంపై అదనంగా రూ.11,339 కోట్ల వ్యయం పడుతుందని వివరించారు.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ప్రస్తుతం EPF పరిధికి వెలుపల ఉన్న మరికొంతమంది ఉద్యోగులు కూడా సామాజిక భద్రత పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. తాజా నిర్ణయంతో ఉద్యోగుల భవిష్యత్ పొదుపులు, రిటైర్మెంట్ ప్రయోజనాలకు మరింత అవకాశం కలగనుంది. ఇది చాలా కాలంగా ఉన్న డిమాండ్.. ఇన్నాళ్లకు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు.

