Egg Prices: సామాన్యుడికి కోడిగుడ్ల ధరలు షాక్ ఇస్తున్నాయి. గత ఏడాది కాలంలో గుడ్ల ధరలు సుమారు 35 నుంచి 40 శాతం పెరిగినట్లు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (NECC) గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఫామ్ స్థాయిలో ఒక్క గుడ్డు ధర సుమారు రూ.7కి చేరగా, రిటైల్ మార్కెట్లో వినియోగదారులకు రూ. 8.50 నుంచి రూ. 9 వరకు ధర ఉంది. రాబోయే చలికాలంలో గుడ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఫౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చలికాలంలో సాధారణంగా కోడిగుడ్ల వినియోగం పెరుగుతుంది. దీనికి తోడు కోళ్ల దానా ధరలు పెరగడం ఫౌల్ట్రీ రైతులపై అదనపు భారం పడుతోంది.
E20 పాలసీ కారణమా..?
కోళ్ల దాణాకు ప్రధానంగా మొక్కజొన్నను ఉపయోగిస్తారు. ఫౌల్ట్రీ రైతుల మొత్తం ఉత్పత్తి వ్యయంలో మొక్కజొన్న వాటా సుమారు 65-70 శాతం వరకు ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మూడేళ్ల క్రితం టన్ను మొక్కజొన్న ధర సుమారుగా రూ. 14,000 ఉండగా, ప్రస్తుతం రూ. 26,500కు పెరిగింది. గత 5 నెలల్లో మొక్కజొన్న ధర దాదాపుగా 20 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. దాణా ధరల పెరుగుదల అంతిమంగా చికెన్, కోడిగుడ్ల ధరల పెరుగుదలకు దారి తీస్తుంది.
అయితే, ఇక్కడే E20 పెట్రోల్ పాలసీపై ఆరోపణలు వస్తున్నాయి. పెట్రోల్లో ఇథనాలు కలపడం వల్ల మొక్కజొన్న అందుబాటులో ఉండటం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇథనాల్ ఉత్పత్తిలో చెరుకు, మొక్కజొన్న కీలకం. ఫౌల్ట్రీ రంగానికి అందుబాటులో ఉండే మొక్కజొన్న ఇప్పుడు ఇథనాల్ తయారీకి వాడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.
మొక్కజొన్న ఆధారిత ఇథనాల్ ఉత్పత్తి కూడా వేగంగా పెరిగింది. 2022లో సుమారు 10 లక్షల టన్నులుగా ఉన్న ఉత్పత్తి 2024లో 60 లక్షల టన్నులకు పైగా చేరింది. ప్రస్తుతం ఇది 1.7 కోట్ల టన్నులకు చేరినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 2030 నాటికి ఇథనాల్ కోసం మొక్కజొన్న వినియోగం 2.5 కోట్ల టన్నులకు చేరొచ్చని అంచనా. దీంతో ఫౌల్ట్రీ పరిశ్రమకు అవసరమయ్యే మొక్కజొన్న దూరమయ్యే అవకాశం ఉంది.
ఇథనాల్ ఒక్కటే కారణం కాదు..
కోడిగుడ్ల ధరలు పెరగడానికి E20 పాలసీ, ఇథనాల్ డిమాండ్ ఒక్కటే కారణం కాదు. వేసవి వేడి కారణంగా కోళ్లపై ఏర్పడే హీట్ స్ట్రెస్, కోళ్ల మరణాల రేటు, వాతావరణ పరిస్థితులు, దిగుమతి చేసుకునే దాణా పదార్థాల లభ్యత, వాటి ధరలు కూడా గుడ్ల ధరలపై ప్రభావం చూపుతున్నాయి. చలి కాలంలో గుడ్ల వినియోగం పెరుగుతుంది. అదే సమయంలో కోళ్ల దాణా అందుబాటులో ఉండకపోతే మరింతగా ధరలు పెరిగే అవకాశం ఉంది.

