NTV Telugu Site icon

Voter ID:17 ఏళ్లకే ఓటరు కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు.. ఈసీ కీలక నిర్ణయం

Voter Card

Voter Card

Voter ID: మనదేశంలో ఓటర్ జాబితా పేరు నమోదు చేసుకుని ఓటరు కార్డు పొందాలంటే 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడాల్సిందే. ఇకపై ఓటరు కార్డు దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న కనీస వయస్సుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 17 ఏళ్లుపైబడిన యువత ఓటరు జాబితాలో పేరు నమోదుకు ముందస్తుగా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది. ప్రజల్లో అవగాహన కల్పించాలని వెల్లడించింది. ఇప్పటి వరకు జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయస్సు గల వారు మాత్రమే ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా.. తాజాగా ఈసీ తీసుకున్న నిర్ణయంతో 17 ఏళ్ల వారందరికీ అవకాశం లభించినట్లయింది.

జనవరి 1వ తేదీ ఎప్పుడొస్తుందా అని వేచి చూడకుండా 17 ఏళ్ల వయసు దాటిన వారు ఓటర్‌ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటరు జాబితాలో యువత పేర్ల నమోదుకు సంబంధించి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌తోపాటు ఎన్నికల కమిషనర్‌ అనూప్‌ చంద్రపాండే ఈ నిర్ణయాన్ని వెలువరించారు. ముందస్తు ఓటరు నమోదుకు అవసరమైన సాంకేతికతను అందుబాటులో ఉంచాలని అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు, ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Command Control Room Live : కమాండ్ కంట్రోల్ రూమ్ సిటీకి మూడో కన్ను కానుందా.?

ఇప్పటివరకు యువత జనవరి నెలలోనే ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ఉండేది. ఇక నుంచి ఏడాదికి నాలుగు సార్లు అవకాశం ఇచ్చారు. యువత కేవలం జనవరిలోనే కాకుండా ఏప్రిల్‌ 1, జులై 1, అక్టోబర్‌ 1వ తేదీల్లో ఓటర్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ప్రతి త్రైమాసికానికి ఓటరు జాబితాను అప్‌డేట్ చేస్తారు. ప్రతి త్రైమాసికానికి అంటే.. ఇకపై మూడు నెలలకు ఒకసారి ఓటర్‌ జాబితాను అప్‌డేట్ చేస్తారు. 2023లో జనవరి 1 లేదా ఏప్రిల్‌ 1 లేదా జులై 1 లేదా అక్టోబర్‌ 1 నాటికి… 18 ఏళ్లు నిండే ప్రతి ఒక్కరు అడ్వాన్స్‌గా ఓటర్‌ కార్డు కోసం ఇప్పటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ఆర్‌పీ యాక్ట్‌ 1950లోని సెక్షన్‌ 14బీ, రిజిస్ట్రేషన్ ఆఫ్‌ ఎలక్టోర్స్ రూల్స్‌, 1960 చట్టాల్లో న్యాయశాఖ మార్పులు చేసింది. దరఖాస్తు ఫారాలను కూడా మరింత సులభతరంగా ఎన్నికల సంఘం మార్చనుంది. కొత్త దరఖాస్తు ఫారాలు 2022, ఆగస్టు 1వ తేదీ తర్వాత అందుబాటులోకి రానున్నాయి. అయితే.. ఆలోపు పాత దరఖాస్తుల్లో వివరాలు అందించిన వారికి అనుమతిస్తారు. ఆధార్‌ సంఖ్యతో ఓటరు కార్డుల అనుసంధాన ప్రక్రియను ఆగస్టు 1 నుంచి ప్రారంభించేందుకు ఈసీ ఇప్పటికే సిద్ధమైంది. దీనికోసం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసిన ఎన్నికల సంఘం.. ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదని.. స్పచ్ఛందం మాత్రమేనని స్పష్టం చేసింది.