DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు

  • ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ABVP సంచనల విజయం..
  • DUSU లో మూడు కీలక పోస్టుల్ని దక్కించుకున్న ఏబీవీపీ..
  • ఉపాధ్యక్షుడిగా స్వతంత్ర అభ్యర్థి విజయం..
  • ఏబీవీపీ ఖాతాలో అధ్యక్ష, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పోస్టులు..
Abvp

Abvp

DUSU Elections: దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మంగా భావించే విద్యార్థి ఎన్నికల్లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్(DUSU) ఎన్నికలు ఒకటి. ఈ ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్( ABVP) సత్తా చాటింది. ABVP అధ్యక్ష పదవితో సహా సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పోస్టుల్ని కైవసం చేసుకుంది. ఉపాధ్యక్ష పదవిని స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకీన్ గెలుచుకున్నారు. శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో ABVP, NSUI మధ్య హోరాహోరీ పోటీ నడిచింది. ఒకానొక దశలో NSUI అభ్యర్థులు ఆధిక్యంలో నిలిచారు. రౌండ్ రౌండ్‌కు ఆధిక్యం మారుతూ చివరకు ABVP అభ్యర్థులు నాలుగు కీలక స్థానాల్లో మూడింటిని దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP), నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI), AISA-SFI కూటమి మధ్య జరిగిన తీవ్ర పోటీ తర్వాత ఈ ఫలితాలు వచ్చాయి.

DUSU అధ్యక్షుడిగా యశ్ దాబాస్..

ABVPకి చెందని యశ్ దాబాస్, NSUI అభ్యర్థి విజయ్ శంకర్ మీనాల మధ్య హోరాహోరీ పోటీ నడిచింది. ఇద్దరి అభ్యర్థుల మధ్య ఆధిక్యం మారుతూ వచ్చింది. 20వ రౌండ్ పూర్తయ్యే సరికి యశ్ విజయం సాధించారు. యశ్‌కు మొత్తం 24,576 ఓట్లు రాగా, విజయ్ శంకర్ మీనాకు 22,523 ఓట్లు వచ్చాయి.

సెక్రటరీగా రియా చబాడి, జాయింట్ సెక్రటరీగా లక్ష్య రాజ్ సింగ్ విజయం సాధించారు. యూనివర్సిటీ నాలుగు కేంద్ర ప్యానెల్ స్థానాల్లో మూడింటిని ఏబీవీపీ కైవసం చేసుకుంది. ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకీన్ ఏబీవీపీ, ఎన్ఎస్‌యూఐ అభ్యర్థుల్ని చిత్తుగా ఓడించారు.

జెన్-జీ ఉద్యమం తర్వాత తొలి తీర్పు..

నీట్ పేపర్ లీక్ ఉద్యమం తర్వాత జరిగిన తొలి స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ఏబీవీపీ గెలిచింది. ఎన్ఎస్‌యూఐ పోటీ ఇచ్చినప్పటికీ, అది సరిపోలేదు. ఈ విజయం ద్వారా బీజేపీ గెలిచినట్లు అవుతుంది. బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగం ఏబీవీపీ గెలవడంతో ఇప్పుడు ఆ పార్టీ జెన్-జీ, యువత తమకు మద్దతుగా ఉన్నట్లు చెప్పుకుంటుంది.