టెక్ సిటీ బెంగళూరులో ప్రధాన రహదారులన్నీ గుంతలమయం అయ్యాయి. దీంతో ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు రిపేర్ చేయాలంటూ ఇటీవల బెంగళూరు వాసులు ఆందోళన కూడా చేశారు. అలాగే ప్రతిపక్ష బీజేపీ కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు కారణంగా ఐటీ కంపెనీలు తరలిపోతున్నాయని ఆరోపించింది. బెంగళూరు శిథిలావస్థకు చేరుకుంటోందని.. టెక్ హబ్ను గుంతల నగరంగా మార్చారంటూ కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి ఇటీవల ఆరోపించారు. రోడ్డు పరిస్థితులు బాగోలేకపోవడంతో కంపెనీలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నాయని తెలిపారు. బీజేపీ ఆరోపణలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ స్పందించారు.
‘‘రోడ్లపై గుంతలు కేవలం కర్ణాటకలోనే ఉన్నాయా? నిన్న నేను ఢిల్లీలోకి వెళ్తే ప్రధాని మోడీ నివాస రోడ్డులో కూడా గుంతలు కనిపించాయి. కానీ మీడియా మాత్రం కర్ణాటక రోడ్లనే మాత్రమే చూపిస్తున్నాయి.’’ అని డీకే.శివకుమార్ తిప్పికొట్టారు. భారీ వర్షాలు కారణంగా దేశ వ్యాప్తంగా రోడ్లు గుంతలమయం అయ్యాయన్నారు.
అయినా కూడా ఓ వైపు వర్షాలు పడుతున్నప్పటికీ వేలాది గుంతలు పూడ్చుతూనే ఉన్నామని చెప్పారు. దేశ వ్యాప్తంగా రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని.. దీనికి బీజేపీనే కారణం అన్నారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కర్ణాటకలోనే గుంతలను బీజేపీ చూపిస్తోందని ధ్వజమెత్తారు.
నవంబర్ నాటికి గుంతలను పూడ్చడానికి కాంట్రాక్టర్లకు తుది గడువు ఇచ్చామని, నగరవ్యాప్తంగా రోడ్డు మరమ్మత్తు, నిర్మాణం కోసం రూ.1,100 కోట్లు కేటాయిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ‘‘మా లక్ష్యం పరిశుభ్రమైన బెంగళూరు, సజావుగా ట్రాఫిక్ సాగడం. గుంతలను వీలైనంత త్వరగా తొలగించేలా చూస్తాం.’’ అని డీకే.శివకుమార్ స్పష్టం చేశారు.