DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు ఢిల్లీలో హైకమాండ్కు చేరాయి. సీఎం మార్పుపై జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సిద్ధరామయ్యను దించి డీకే శివకుమార్ను సీఎంగా చేస్తారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వాదనలు ఇలా కొనసాగుతున్న తరుణంలో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కే ఎన్ రాజన్న చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కొన్ని నెలల క్రితమే కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఉండొచ్చని రాజన్న అన్నారు. ‘‘ నాకు తెలిసిన సమాచారం ప్రకారం.. డీకే శివకుమార్ 3-4 నెలల క్రితమే అధిష్టానానికి తన రాజీనామా పంపి ఉండవచ్చు’’ అని చెప్పారు. నాయకత్వ సమస్యను ఇలా సాగదీయడం పార్టీకి కానీ, రాష్ట్రంలో సుపరిపాలనకు కానీ మంచిది కాదని ఆయన చెప్పారు. ఇక జరిగింది చాలని, దీనికి ముగింపు పలకాలని అన్నారు. ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు రాష్ట్రంలో పాలనపై ప్రభావం చూపిస్తుందని చెప్పారు. పార్టీ నాయకత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.
ఇదిలా ఉంటే, ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ భేటీ అవుతున్న సమయంలోనే రాజన్న నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం.
