కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. గురువారం సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం.. సాయంత్రం గవర్నర్ ఆమోదించడం కూడా జరిగి పోయింది. ఇక తదుపరి ముఖ్యమంత్రిగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఢిల్లీలో ఉన్న డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా జాగ్రత్తగా.. ఆచితూచి స్పందించారు.
కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమం తేదీపై ఇప్పుడే ఎలాంటి ప్రకటన చేయలేమని స్పష్టం చేశారు. ‘‘కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (CLP) నాయకుడిని ఇంకా అధికారికంగా ఎన్నుకోలేదు. ఆ నిర్ణయం పూర్తిగా లెజిస్లేటర్ల ద్వారా ఫార్మలైజ్ అయ్యే వరకు ప్రమాణస్వీకారం ఎప్పుడు జరుగుతుందో ఎలా చెప్పగలను?” అని శివకుమార్ వ్యాఖ్యానించారు. శనివారం జరగనున్న CLP సమావేశానికి ముందుగా ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారాయి.
రేపు కేంద్ర నాయకత్వం సీఎల్పీ సమావేశానికి హాజరుకానుందని… కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరుకు రావాలని ఆదేశించినట్లు తెలిపారు. కేవలం ప్రభుత్వ ఏర్పాటే కాకుండా కర్ణాటకలో పార్టీ సంస్థాగత నియామకాలు, రాజ్యసభ సీట్ల పంపకంపై కూడా చర్చలు కొనసాగుతున్నాయని… రాజ్యసభ అభ్యర్థుల ఎంపికను రాష్ట్రాల వారీగా కాకుండా జాతీయ స్థాయిలో ఒకేసారి ప్రకటించే అవకాశం ఉందని శివకుమార్ వెల్లడించారు. కీలకమైన శాసన ప్రక్రియలు, అధికారిక లాంఛనాలు పూర్తైన తర్వాతే ఏ నిర్ణయమైనా ప్రకటించగలమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రధాన దృష్టి లెజిస్లేచర్ పార్టీ నాయకత్వ ఎన్నికపైనే ఉందని తేల్చి చెప్పారు.
మరోవైపు సిద్దరామయ్య తన కుమారుడు యతీంద్రను ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని పార్టీ హైకమాండ్ను కోరినట్లు సమాచారం. అలాగే కేఎస్ జార్జ్, జీ పరమేశ్వరను కేబినెట్లో కొనసాగించాలని కూడా సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాల మధ్య కర్ణాటకలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ తుది చర్చలు జరుపుతోంది.
