NTV Telugu Site icon

Congress Presidential Election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ఎన్ని ట్విస్టులో?.. బరిలో దిగ్విజయ్ సింగ్

Digvijay Singh

Digvijay Singh

Congress Presidential Election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తున్నారనే విషయంపై ఇంకా స్పష్టతం రావడం లేదు. రాజస్థాన్‌లో తలెత్తిన పరిణామాల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ బుధవారం రాత్రి ప్రత్యేక విమానంలో దిల్లీ చేరుకున్నారు. కానీ ఆయనకు అపాయింట్​మెంట్​ దక్కలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరో సీనియర్ నేత ఆంటోనీతో సోనియా గాంధీ భేటీ అయ్యారు. అశోక్‌ గెహ్లాట్‌ తన పోటీపై స్పష్టత తీసుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ధిక్కార స్వరం వినిపిస్తుండడంతో తాజాగా సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్‌ పేరు తెరపైకి వచ్చింది. అధ్యక్ష ఎన్నికలో దిగ్విజయ్‌ సింగ్ బరిలోకి దిగడం ఖాయమైంది.

పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆయనవైపే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. నామినేషన్ల ప్రక్రియ మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో సోనియా గాంధీ బుధవారం సీనియర్‌ నాయకుడు, పార్టీకి విధేయుడైన ఏకే ఆంటోనీతో సమావేశయ్యారు. అధ్యక్ష ఎన్నికల బరిలోకి దింపాల్సిన అభ్యర్థిపై గంటన్నరకు పైగా చర్చించినట్లు తెలిసింది. మరోవైపు కాంగ్రెస్‌ నాయకుడు దిగ్విజయ్ సింగ్ పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నారు. అనంతరం ఆయన సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ నుండి నామినేషన్ పత్రాలను తీసుకుంటారు. సెంట్రల్ ఎలక్షన్‌ అథారిటీ ఛైర్మన్‌ ప్రస్తుతం ఢిల్లీకి దూరంగా ఉన్నందున దిగ్విజయ్‌ సింగ్ సెప్టెంబర్ 30న తన నామినేషన్ పత్రాలను సమర్పించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

National Games 2022: నేటి నుంచే జాతీయ క్రీడలు.. ప్రారంభించనున్న ప్రధాని మోడీ

దిగ్విజయ్‌ ప్రస్తుతం కేరళలో భారత్‌ జోడో యాత్రలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా, తాను సైతం బరిలో ఉంటానని సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశీ థరూర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేయబోతున్నానని ఆయన ఇటీవలే తేల్చిచెప్పారు. అధినేత్రి సోనియాగాంధీ ఆదేశిస్తే కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నిక బరిలో దిగేందుకు పార్టీ సీనియర్‌ నాయకుడు మల్లికార్జున ఖర్గే (80) సిద్ధమని ఆయన సన్నిహితుడొకరు బుధవారం చెప్పారు. నెహ్రూ-గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న మల్లికార్జున ఖర్గే ఇటీవల పార్టీ అధ్యక్షురాలు సోనియాను కలిసి, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అది తనకు శిరోధార్యమని చెప్పారు. అధ్యక్ష బరిలో దిగేందుకు తనకు ఆసక్తి లేదని సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ మరోసారి స్పష్టం చేశారు. తన దృష్టంతా ఏడాదిలో జరగనున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలపైనే ఉందన్నారు.