Dharmendra Pradhan: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. శనివారం ఆయన తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్రమోడీకి పంపారు. యువత, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనలకు కేంద్ర మంత్రి దిగొచ్చారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. తన రాజీనామా లేఖలో ఆయన మాట్లాడుతూ.. గత నాలు దశాబ్ధాలుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యా సంస్కరణలోకి పనిచేస్తున్నామని తెలిపారు. దేశ యువత ఆకాంక్షలను నెరవేర్చడంతో తన నైతిక బాధ్యతగా భావించినట్లు లేఖలో పేర్కొన్నారు.
2026 మే 3న నిర్వహించిన NEET-UG పరీక్షలో అవకతవకలు వెలుగులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించిందని గుర్తు చేశారు. పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించడంతో పాటు వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 20 లక్షల మందికి పైగా విద్యార్థుల కో్సం తిరిగి పరీక్ష విజయవంతంగా నిర్వహించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జూన్ 21నపరీక్ష విజయవంతంగా పూర్తయిందని అన్నారు.
తాను మొదటి రోజు నుంచే బాధ్యత తీసుకున్నాని, ఎగ్జామ్ మాఫియా వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు నష్టపోకుండా కృషి చేశానని పేర్కొన్నారు. జూలై 16న ప్రకటించిన ఫలితాల్లో పేద, వెనకబడిన వర్గాలకు చెందిన అనేక మంది విద్యార్థులు విజయాన్ని సాధించడం సంతోషకరమని అన్నారు. ఇదే సమయంలో బాధ్యతయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు విద్యార్థుల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం తనను బాధించిందని చెప్పారు. గత 10 రోజులుగా జరిగిన పరిణామాలు కలిచివేశాయని, ఇది నా వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదని స్పష్టం చేసింది.
జంతర్ మంతర్తో పాటు దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, దేశవ్యతిరేక శక్తులు దీనిని ఉపయోగించుకోకుండా ఉండేందుకు, జాతీయ ఐక్యత కాపాడేందుకు, విద్యార్థుల భవిష్యత్తు న్యాయపరమైన చిక్కుల్లో పడకుండా ఉండేందుకు, వారు చదువులపై దృష్టి సారించేలా చేయడానే ఉద్దేశంతోనే ప్రధాన మంత్రికి రాజీనామా లేఖ సమర్పించినట్లు వెల్లడించారు. తనపై నమ్మకం ఉంచిన ప్రధాని మోడీకి, కేంద్ర మంత్రివర్గ సహచరులకు, విద్యాశాఖ అధికారులకు థాంక్స్ చెప్పారు. దేశ సేవే తన జీవిత లక్ష్యమని, భవిష్యత్తులోనూ ఒడిశా ప్రజలు, దేశ యువత కోసం సేవ చేస్తూనే ఉంటానని పేర్కొన్నారు.

