దేశ రాజధాని ఢిల్లీలో హోటళ్లలో రూమ్ల కొరత ఏర్పడింది. అన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. చిన్న హోటళ్ల దగ్గర నుంచి పైవ్స్టార్ హోటళ్ల వరకు అన్ని రష్గా ఉన్నాయి. ఒక్కసారిగా భారీ డిమాండ్ పెరిగింది. దీనింతంటికి బ్రిక్స్ సమావేశాలు కారణంగా చెబుతున్నారు. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలోని ప్రముఖ లగ్జరీ హోటళ్లలో గదుల లభ్యత భారీగా తగ్గింది. కొన్ని హోటళ్లలో అసలు గదులే అందుబాటులో లేకపోగా.. మరికొన్ని హోటళ్లలో ఒక్క రాత్రికి గది అద్దెలు ఏకంగా ఆరు అంకెలకు చేరుకున్నాయి. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ నివేదిక ప్రకారం.. సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు హోటల్ బుకింగ్ ప్లాట్ఫామ్లను పరిశీలించగా ఈ పరిస్థితి కనిపించింది.
ప్రముఖ హోటళ్లలో రూమ్లు నిల్..
ఢిల్లీలోని తాజ్ మహల్, తాజ్ ప్యాలెస్ హోటళ్లలో సెప్టెంబర్ 11-13 తేదీల్లో గదులు అందుబాటులో లేవు. ది ఒబెరాయ్, న్యూఢిల్లీలోనూ ఈ కాలంలో కొంత భాగానికి గదులు పూర్తిగా బుక్ అయ్యాయి. ది లీలా ప్యాలెస్ న్యూఢిల్లీ మాత్రం పేర్కొన్న తేదీలకు బుకింగ్లను స్వీకరించడం లేదు. మరోవైపు ఐటీసీ మౌర్య, షాంగ్రి-లా ఎరోస్ న్యూఢిల్లీ వంటి హోటళ్లలో కొన్ని గదులు అందుబాటులో ఉన్నప్పటికీ.. వాటి అద్దెలు భారీగా పెరిగాయి. ఒక్క రాత్రికి ఆరు అంకెల్లో ఉన్న టారిఫ్లు కూడా కనిపిస్తున్నాయి. దీంతో బ్రిక్స్ సదస్సు సమయంలో ఢిల్లీలో వసతికి ఎంతటి డిమాండ్ ఉందో అర్థమవుతోంది.
పర్యాటకులు, వ్యాపార ప్రయాణికులపై ప్రభావం
రెండు రోజుల పాటు జరిగే సదస్సు కారణంగా ప్రతినిధులు, ఇతర సందర్శకులు ముందుగానే ఢిల్లీకి చేరుకోవడంతో పాటు.. కొందరు తమ బసను సదస్సు తర్వాత కూడా కొనసాగించే అవకాశం ఉంది. దీంతో సెంట్రల్ ఢిల్లీలోని హోటళ్లలో గదుల లభ్యతపై మరింత ఒత్తిడి ఏర్పడుతోంది. దీని ప్రభావం ఇప్పటికే ప్రణాళికలు వేసుకున్న పర్యాటకులు, వ్యాపార ప్రయాణికులు, కుటుంబాలపై పడే అవకాశం ఉంది. వారు హోటల్ గదుల కోసం భారీ మొత్తాన్ని చెల్లించాల్సి రావచ్చు. లేదంటే సెంట్రల్ ఢిల్లీకి దూరంగా ఉన్న హోటళ్లను ఎంచుకోవడం, ప్రయాణ తేదీలను మార్చుకోవడం లేదా తక్కువ ధర కలిగిన వసతులను వెతుక్కోవాల్సి రావచ్చు.
25 శాతానికి పైగా పెరిగిన గది అద్దెలు
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలు సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో.. భారత హోటల్ రంగం ఈవెంట్లు, దేశీయ పర్యాటక డిమాండ్పై ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో సదస్సు హోటల్ రంగానికి కీలక డిమాండ్ను తీసుకొస్తోంది. రాడిసన్ హోటల్ గ్రూప్ సౌత్ ఏషియా మేనేజింగ్ డైరెక్టర్, COO నిఖిల్ శర్మ మాట్లాడుతూ.. సెప్టెంబర్లో తమ హోటల్ పోర్ట్ఫోలియోలో సగటు గది అద్దెలు గతేడాదితో పోలిస్తే 25 శాతానికి పైగా పెరిగినట్లు తెలిపారు. సదస్సు కారణంగా ఈవెంట్కు ముందు, తర్వాత రోజుల్లో డిమాండ్ మరింత పెరిగిందని చెప్పారు. చివరి నిమిషంలో బుకింగ్లు చేసుకునే ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందన్నారు.
లగ్జరీ హోటళ్లపై ఎక్కువ ప్రభావం
అంతర్జాతీయ, జాతీయ స్థాయి పెద్ద ఈవెంట్లు ముఖ్యంగా లగ్జరీ హోటళ్లు, MICE (Meetings, Incentives, Conferences and Exhibitions) విభాగానికి ఎంతో కీలకం. ఇలాంటి కార్యక్రమాల సమయంలో హోటల్ గదులతో పాటు సమావేశ మందిరాలు, ఇతర హాస్పిటాలిటీ సేవలకు డిమాండ్ ఒక్కసారిగా పెరుగుతుంది. ఢిల్లీలో హోటల్ మార్కెట్లోనూ బ్రిక్స్ సదస్సు కీలక డిమాండ్ ఉత్ప్రేరకంగా మారింది. ముఖ్యంగా వ్యాపార, దౌత్య ప్రాంతాల్లో ఉన్న లగ్జరీ హోటళ్లలో గదుల సంఖ్య పరిమితంగా ఉండటంతో ధరలపై ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం కనిపిస్తున్న భారీ ధరలను స్థిరమైన మార్కెట్ రేట్లుగా భావించకూడదు. హోటల్ బుకింగ్లు, క్యాన్సిలేషన్లు, కొత్త గదులను అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాల ఆధారంగా గది అద్దెలు, లభ్యత ఎప్పటికప్పుడు మారుతుంటాయి.

