పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొంది. దీంతో ఆయా దేశాల్లో పొదుపు మంత్రం అమలవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ కూడా దేశ పౌరులకు పొదుపు మంత్రం పిలుపునిచ్చారు. మోడీ పిలుపు మేరకు ఇప్పటికే ప్రధాని సహా కేంద్రమంత్రులు, రాష్ట్రాలు పొదుపు మంత్రం పాటిస్తున్నారు.
తాజాగా ఢిల్లీ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంధన పొదుపుపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఇకపై ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ వారానికి రెండు రోజుల పాటు తప్పనిసరిగా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అమలు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే ప్రైవేట్ సంస్థలు కూడా వారంలో ఏ రెండు రోజులైనా రిమోట్ వర్క్ అమలు చేయాలని సూచించారు.
దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అమలును కార్మిక శాఖ పర్యవేక్షిస్తుందని తెలిపారు. ప్రైవేట్ సంస్థలు కూడా ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇక ప్రభుత్వ స్థాయిలో చేపట్టే చర్యల గురించి వివరించిన సీఎం.. రేపటి నుంచి పెట్రోల్ అలవెన్స్ను 20 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే వచ్చే ఏడాది పాటు మంత్రులు, ఉన్నతాధికారుల అధికారిక విదేశీ పర్యటనలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలువురు మంత్రులు తమ కాన్వాయ్లలో వాహనాల సంఖ్యను తగ్గించారని గుర్తు చేశారు.
ప్రభుత్వ వాహనాల వినియోగాన్ని తగ్గించి.. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఎక్కువగా ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించాలని, కార్పూలింగ్కు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలు కూడా వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి మెట్రో రైళ్లు, బస్సులను ఉపయోగించాలని సూచించారు. దీంతో ఇంధన పొదుపుతో పాటు ట్రాఫిక్ రద్దీ, వాయు కాలుష్యం కూడా తగ్గుతాయని తెలిపారు.
ఇకపై ప్రతి సోమవారం “మెట్రో మండే”గా పాటించనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల పని వేళలను ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నిర్ణయించారు. ఇక మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ కార్యాలయాలు ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయనున్నాయి. ఇక పర్యాటకుల కోసం ప్రత్యేక ప్రయాణ ప్రణాళిక రూపొందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అలాగే వచ్చే మూడు నెలల పాటు ఎలాంటి భారీ కార్యక్రమాలు నిర్వహించబోమని స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, ఢిల్లీ జల్ బోర్డ్, ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ శాఖలు కూడా ప్రత్యేక ఆదేశాలు జారీ చేశాయి. వర్చువల్ సమావేశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని, వారానికి ఒకరోజు “నో కార్ డే” పాటించాలని అధికారులకు సూచించాయి.
#WATCH | Delhi: At a press conference, CM Rekha Gupta says, "… Our departments have already cut down on fuel expenses with only the minimum vehicles needed being used, and public transport is being used wherever possible. Officials’ petrol limits of 200–250 litres per month… pic.twitter.com/3EMFuzrh6D
— ANI (@ANI) May 14, 2026
