Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం

  • దేశ రాజధానిలో కలకలం
  • కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర భగ్నం
  • నిందితుల్ని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు
Delhi

Delhi

ప్రస్తుతం దేశంలో పూణె వ్యాపార వేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు కుదిపేస్తోంది. పెళ్లి కాక ముందే సియా గోయల్ అనే యువతి.. ప్రియుడి సాయంతో చంపేసింది. ప్రస్తుతం ఏ న్యూస్ మీడియాలో చూసినా.. సోషల్ మీడియాలో చూసినా ఇదే హాట్ టాఫిక్‌గా నడుస్తోంది. హనీమూన్ మర్డర్ కేసు దగ్గర నుంచి తాజాగా కేతన్ అగర్వాల్ హత్య కేసు దాకా ప్రజల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో దేశ రాజధాని ఢిల్లీలో భర్తను చంపేందుకు కుట్ర పన్నిన ఓ ఇల్లాలి దురాగతం వెలుగులోకి వచ్చింది. భర్త నుంచే రూ.50 లక్షలు దోచుకునేందుకు గ్యాంగ్‌స్టర్లతో కలిసి ఎక్స్‌టార్షన్ ప్లాన్ చేసిన భార్య కుట్రను పోలీసులు ఛేదించారు.

దేశ రాజధాని ఢిల్లీలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త నుంచి రూ.50 లక్షలు వసూలు చేసేందుకు ఓ వ్యాపారవేత్త భార్య.. విదేశాల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్లతో కలిసి ఎక్స్‌టార్షన్ కుట్ర పన్నినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో వ్యాపారవేత్త భార్యతో పాటు గోగి గ్యాంగ్‌కు చెందిన ఓ అనుచరుడిని ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ అరెస్టు చేసింది.

పోలీసుల వివరాల ప్రకారం.. తూర్పు ఢిల్లీలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో హోల్‌సేల్ వ్యాపారం నిర్వహిస్తున్న ఓ వ్యాపారికి జూన్ 14న అంతర్జాతీయ నంబర్ నుంచి బెదిరింపు కాల్స్, సందేశాలు వచ్చాయి. కాల్ చేసిన వ్యక్తి తాను గోగి గ్యాంగ్ సభ్యుడినని చెప్పి రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బు ఇవ్వకపోతే వ్యాపారితో పాటు అతని కుటుంబ సభ్యులను హత్య చేస్తామని బెదిరించాడు. అంతేకాకుండా బాధితుడి ఇల్లు, దుకాణానికి సంబంధించిన ఫొటోలు, లొకేషన్‌లను కూడా పంపించాడు. దీంతో బాధితుని నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టగా.. జూన్ 25న హర్యానాలోని సోనిపట్‌కు చెందిన రజత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా అమెరికాలో ఉన్న ఎక్స్‌టార్షన్ కాలర్‌తో పాటు బాధితుడి భార్య సప్నా జైన్, ఆమె సోదరితో కూడా అతను తరచూ సంప్రదింపులు జరిపినట్లు గుర్తించారు.

విచారణలో రజత్ కీలక విషయాలు వెల్లడించడంతో పోలీసులు అవాక్కయ్యారు. భర్త నుంచి డబ్బు దోచుకునేందుకు సప్నా జైన్ ఈ మొత్తం కుట్ర పన్నిందని, కుటుంబ కలహాల కారణంగా అనంతరం తన అత్తను హత్య చేయాలని, భర్తపై కూడా దాడి చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు నిందితుడు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. రజత్ ఇచ్చిన సమాచారం.. మొబైల్ ఫోన్లలో లభించిన చాట్‌లతో సహా ఇతర డిజిటల్ ఆధారాల ఆధారంగా పోలీసులు సప్నా జైన్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో విదేశాల్లో ఉన్న గోగి గ్యాంగ్ సభ్యుల పాత్రపై కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.