NTV Telugu Site icon

New criminal laws: మూకదాడికి పాల్పడితే ఇక మరణశిక్షే.. దేశద్రోహ చట్టానికి ఇక చెల్లు..

Amit Shah

Amit Shah

New criminal laws: కేంద్రం కొత్తగా మూడు క్రిమినల్ చట్టాలను తీసుకురాబోతోంది. దీనికి సంబంధించిన బిల్లులను పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టారు. దీనిపై కేంద్రం హోంమంత్రి అమిత్ షా బుధవారం లోక్‌సభలో మాట్లాడారు. ఇకపై మూకదాడికి పాల్పడిన నేరాల్లో మరణశిక్ష విధించే నిబంధన ఉందని చెప్పారు. అలాగే స్వాతంత్ర సమరయోధులను జైలులో పెట్టడానికి బ్రిటీష్ వారు తీసుకువచ్చిన దేశద్రోహ చట్టాన్ని తొలగించాలని కేంద్రం నిర్ణయించినట్లు అమిత్ షా ప్రకటించారు.

బుధవారం మూడు క్రిమినల్ చట్టాలను అమిత్ షా లోక్‌సభ ముందుకు తీసుకువచ్చారు. బ్రిటీష్ వారు చేసిన దేశద్రోహ చట్టం, బాలగంగాధర్ తిలక్, మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్ వంటి స్వాతంత్ర సమరయోధులను అనేక ఏళ్లు జైలులో ఉంచింది. ఈ చట్టం ఈ రోజు వరకు కొనసాగుతోంది. మొట్టమొదటి సారిగా మోదీ ప్రభుత్వం ఈ దేశద్రోహ చట్టాన్ని రద్దు చేస్తుంది అని ఆయన లోక్‌సభలో ప్రకటించారు.

Read Also: Pakistan: పాకిస్తాన్‌లో మరొకడిని లేపేశారు..

కొత్త బిల్లులు శిక్షకు బదులుగా న్యాయంపై దృష్టి సారించేలా దేశంలో నేర న్యాయ వ్యవస్థను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతీయ న్యాయ సంహిత బిల్లు-2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బిల్లు-2023, భారతీయ సాక్ష్యా బిల్లు-2023లను మొదటిసారిగా కేంద్ర ఈ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టింది. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లుల్లో సవరణలు తీసుకువచ్చి మళ్లీ ప్రవేశపెట్టారు.

కొత్త న్యాయచట్టాలు పోలీస్ జవాబుదారీతనాన్ని బలోపేతం చేసే వ్యవస్థగా తీసుకువస్తామని అమిత్ షా అన్నారు. అరెస్టయిన వ్యక్తలు గురించి వివరాలు ఇప్పుడు ప్రతీ పోలీస్ స్టేషన్ లో నమోదు చేయబడాలని, ఈ రికార్డులను నిర్వహించే బాధ్యత పోలీస్ అధికారిదే అని ఆయన అన్నారు. అక్రమ రవాణా చట్టాలను లింగ తటస్థంగా మార్చిందని చెప్పారు. 18ఏళ్ల లోపు బాలికపై అత్యాచారం చేస్తే, కొత్త చట్టాల ప్రకారం పోక్సో చట్టానికి సమానమైన నిబంధనలు ఆటోమెటిక్‌గా వర్తిస్తాయని అన్నారు.