Site icon NTV Telugu

Bengaluru: టెక్ సిటీలో అమానుషం.. తండ్రిని సంచిలో పెట్టి కొరియర్‌కు యత్నం.. ఆ తర్వాత ఏమైందంటే..!

Bengaluru

Bengaluru

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. కొందరి చేష్టలు అసహ్యం పుట్టిస్తున్నాయి. ఫేమస్ అవ్వడం కోసం ఏం చేస్తున్నారో అర్థంకాని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో లాభం కంటే అనర్థమే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇందుకు టెక్ సిటీ బెంగళూరులో జరిగిన సంఘటనే ఉదాహరణ. రీల్స్ కోసం కన్న తండ్రినే ప్రాణాలను పణంగా పెట్టింది ఓ కూతురు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

బెంగళూరులోని ఒక కొరియర్ కార్యాలయానికి ఒక పెద్ద సంచి మూటను కొందరు వ్యక్తులు తీసుకొచ్చారు. పార్శిల్ చేయాలంటూ సిబ్బందికి సూచించారు. అయితే సంచి కదలడంతో అనుమానం వచ్చి సిబ్బంది తెరిచి చూడక హఠాత్తుగా ఒక పెద్దాయన అందులోంచి బయటకు వచ్చాడు. దీంతో సిబ్బంది షాక్ అయ్యారు. నిలదీయడంతో డొంక తిరుగుడు సమాధానం ఇచ్చారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అంతే అక్కడ నుంచి పరారయ్యారు. అయితే మూటలో ఉన్న వ్యక్తి పెద్దాయన కావడంతో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. బయటకు రాగానే మంచి నీళ్లు తాగి ఊపిరి పీల్చుకున్నాడు. లేదంటే ప్రాణాలు గాల్లో కలిసి పోయేవి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇక రంగంలోకి దిగిన పోలీసులు… కుటుంబ సభ్యుల్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే రీల్స్ కోసం సరదాగా ఈ నాటకం ఆడామని.. పండగ సమయాల్లో బస్సు టికెట్‌ ధరలు పెరిగిపోవడం, టికెట్లు దొరక్కపోవడం వంటి పరిస్థితులను తెలియజేసేందుకే ఇలా నటించినట్లుగా తెలిపారు. దీంతో వారిని హెచ్చరించి పోలీసులు వదిలిపెట్టేశారు. అయితే ఈ వ్యవహారం సీరియస్‌గా మారడంతో కుటుంబ సభ్యులు క్షమాపణలు చెప్పారు.

 

Exit mobile version