NTV Telugu Site icon

Supreme Court: ప్రభుత్వంపై జర్నలిస్టులు విమర్శలు చేస్తే క్రిమినల్ కేసులు పెట్టొద్దు

Supremecourt

Supremecourt

ప్రభుత్వంపై జర్నలిస్టులు చేసే విమర్శలపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వార్తలు రాస్తే.. జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు పెట్టటం సరికాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన జర్నలిస్ట్‌ అభిషేక్‌ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, ఎస్‌వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం విచారించారు. ప్రజాస్వామ్య దేశాల్లో అభిప్రాయాలు వ్యక్తపరిచే స్వేచ్ఛను గౌరవిస్తారని.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (ఎ) ప్రకారం జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయని సుప్రీంకోర్టు పేర్కొంది. జర్నలిస్టులు రాసే కథనాలను ప్రభుత్వంపై విమర్శలుగా భావించి.. సదరు జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టకూడదని న్యాయస్థానం సూచించింది. అలా చేస్తే అది భావప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించినట్లే అవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఇది కూడా చదవండి: AP Singh: వైమానిక దళం 25% కంటే ఎక్కువ అగ్నివీర్లను పర్మినెంట్ చేయగలదు కానీ…

కుల వివరాలకు సంబంధించి ఓ వార్తా కథనాన్ని ప్రచురించినందుకు ఉ‍త్తర ప్రదేశ్‌ ప్రభుత్వం జర్నలిస్ట్‌ అభిషేఖ్‌ ఉపాధ్యాయ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ ఎఫ్‌ఐఆర్‌ను సవాల్‌ చేస్తూ.. ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో జర్నలిస్ట్‌ అభిషేఖ్‌ ఉపాధ్యాయ్‌ను అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలు రాసినంత మాత్రన జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు పెట్టడం సరికాదని భారత సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

ఇది కూడా చదవండి: నవరాత్రుల్లో ఏ రోజున ఏ రంగు బట్టలు ధరించాలో తెలుసా..