Congress: ఈడీ విచారణకు రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ భారీ నిరసనలు

Rahul Gandhi

Rahul Gandhi

కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్( ఈడీ) రెండో రోజు ప్రశ్నిస్తోంది. సోమవారం ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు విచారించిన ఈడీ దాదాపుగా 10 గంటల పాటు రాహుల్ గాంధీని ప్రశ్నించింది. మంగళవారం కూడా విచారణకు రావాలని ఆదేశించింది. మంగళవారం రాహుల్ గాంధీ, సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి ఈడీ కార్యాలయానికి బయలుదేరారు.

ఇదిలా ఉంటే ఢిల్లీ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఈడీ విచారణకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీకి సంఘీభావం ప్రకటిస్తున్నారు. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం కావాలనే కాంగ్రెస్ నాయకులను అక్రమ కేసుల్లో ఇబ్బందులు పెడుతోందని ఆరోపిస్తున్నారు. మంగళవారం రాహుల్ గాంధీ విచారణకు వెళ్తున్న నేపథ్యంలో ఢిల్లీలో ముఖ్యంగా సెంట్రల్ ఢిల్లీలో ట్రాఫిక్ జామ్ లు ఏర్పడుతున్నాయి. పోలీసులు ఇప్పటికే పలు మార్గాల్లో ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు.

కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు, ఎంపీలు ఢిల్లీలో ఆందోలన నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కెసి వేణుగోపాల్, అధిర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగోయ్, దీపేందర్ సింగ్ హుడా, రంజీత్ రంజన్, ఇమ్రాన్ ప్రతాప్‌గర్ ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

రాహుల్ గాంధీ ఈడీ విచారణపై రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఫైర్ అయ్యారు. దేశంలో చాలా తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయని..రామనవమి, శుక్రవారం నమాజ్ తరువాత ప్రజలు రోడ్లపై కి వస్తున్నారని.. ఆందోళనకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన అన్నారు. ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నాయకులు హిమంత బిశ్వ శర్మ, నారయణ్ రాణేలపై ఈడీ కేసులు ఏమయ్యాయని ప్రశ్నించారు.  పెట్రోల్ ధరలు పెరుగుతుండటం, చైనా ఆక్రమణలపై, ద్రవ్యోల్బనంపై మోదీ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తుండటంతోనే అక్రమ కేసులు,  ఈడీ విచారణలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా విమర్శించారు.