Cockroach Janta Party: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఇటీవల సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. కేవలం కొన్ని రోజుల్లోనే మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించింది. అయితే, దీని వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే శనివారం మాట్లాడుతూ.. తన సీజేపీపై అణిచివేత చర్యలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. తమ సోషల్ మీడియా అకౌంట్ల తొలగింపు, హ్యాకింగ్ జరుగుతోందని అన్నారు. తమ సోషల్ మీడియా అకౌంట్లకు యాక్సెస్ లేకుండా పోయిందని ఆయన అన్నారు. తన వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా హ్యాక్ అయిందని ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
నీట్ యూజీసీ 2026 పేపర్ లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ శుక్రవారం సీజేపీ ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. దీని తర్వాత తన ప్రాణాలకు ప్రమాదం ఉందని, బెదిరింపులు వస్తున్నాయని దీప్కే అన్నారు. బెదిరింపులకు సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేసుకున్నారు. తమ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్కు యాక్సెస్ లేకుండా పోయిందని, ‘‘కాక్రోచ్ జనతా పార్టీ’’ నుంచి వచ్చిన ఏ ప్రకటనను అధికారిక ప్రకటనగా పరిగణించొద్దని దీప్కే చెప్పారు.
ఇదిలా ఉంటే, కాక్రోచ్ జనతా పార్టీపై విమర్శలు కూడా బాగానే పెరిగాయి. దీప్కే గతంలో సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు అతడికి ఆప్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. సీజేపీ ఫాలోవర్లు అంతా బంగ్లాదేశ్, పాకిస్తాన్కు చెందిన వారే అనే వాదన కూడా వినిపిస్తోంది.
