CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తిరుచ్చిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, తన ప్రభుత్వ లక్ష్యాలు, రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను వెల్లడించారు. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు హాజరైన ఈ సభలో విజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సభలో మాట్లాడిన విజయ్, తాను ముఖ్యమంత్రిగా కాకుండా ప్రజల సేవకుడిగా వచ్చానని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో తనపై అనేక విమర్శలు వచ్చాయని, ఆరు నెలలు కూడా నిలవలేరని కొందరు వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. అయితే అలాంటి విమర్శలు చేసినవారే కొన్ని రోజుల్లో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని వ్యాఖ్యానించారు.
డీఎంకే, టీవీకే మధ్యే పోటీ..
ప్రజలు తనకు చూపించిన ఆదరణకు కృతజ్ఞతలు తెలిపిన విజయ్, భవిష్యత్తులో మరింతగా ప్రజల మనసులు గెలుచుకునేందుకు కృషి చేస్తానన్నారు. తనపై రాజకీయ దాడులు చేస్తున్న వారు అలాగే కొనసాగాలని, వారి విమర్శలే తనకు మరింత శక్తిని ఇస్తాయని చెప్పారు. రాష్ట్ర రాజకీయాలపై స్పందించిన విజయ్, ప్రస్తుతం తమిళనాడులో ప్రధాన పోటీ డీఎంకే మరియు టీవీకే మధ్యనే ఉందని పేర్కొన్నారు. ఇతర పార్టీలకు రాజకీయంగా పెద్దగా ప్రాధాన్యత లేదని వ్యాఖ్యానించారు. ప్రజలు ఎవరికి ఓటు వేస్తే వారే సరైనవారని, ఒక పార్టీకి ఓటు వేస్తే ప్రజలు తెలివైనవారు, మరో పార్టీకి ఓటు వేస్తే ప్రజలను విమర్శించడం సరైంది కాదన్నారు. ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడితే సహించబోనని హెచ్చరించారు.
వారంలోనే ప్రత్యేక టాస్క్ ఫోర్స్
డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన విజయ్, ఆదాయం కోసం రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారని ఆరోపించారు. ప్రజల సంక్షేమం కోసం అనేక మద్యం దుకాణాలను మూసివేశామని చెప్పారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో గంజాయి విక్రయాలు పెరిగిపోయాయని ఆరోపించిన ఆయన, వాటిని పూర్తిగా అరికట్టే బాధ్యత తనపై ఉందన్నారు. మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలో తన ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన విజయ్, గత పాలనలో ఏర్పడిన సమస్యలే ప్రస్తుతం బయటపడుతున్నాయని అన్నారు. నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, వారంలోనే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసి మాదకద్రవ్యాల మాఫియా మరియు నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు..
ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ప్రజల ఆశీర్వాదంతో గెలిచామని విజయ్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పనిచేస్తుందని, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పారు.
లంచం లేకుండా చేయడమే ధ్యేయం..
అవినీతి నిర్మూలనే తన ప్రధాన లక్ష్యమని ప్రకటించిన విజయ్, తమిళనాడులో లంచం అనే పదానికి స్థానం లేకుండా చేయాలనేది తన సంకల్పమని వెల్లడించారు. ఇది ఒక్కరోజులో సాధ్యమయ్యే పని కాదని, మాయాజాలం కూడా కాదని తనకు తెలుసని చెప్పారు. అయినప్పటికీ ఒకరోజు రాష్ట్రంలో అవినీతి పూర్తిగా అంతమయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం తనకు రాజకీయాల కంటే పాలన, అభివృద్ధి, ప్రజాసేవ ముఖ్యమని పేర్కొన్న విజయ్, “ఇప్పుడు నాకేమీ పనిలేదు… పనిచేయడమే నా పని” అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
