CJP: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కీలక ప్రకటన చేశారు. ‘‘క్యా బోల్తీ పబ్లిక్’’ పేరుతో దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు గురువారం ప్రకటించారు. ఈ ప్రచారం ద్వారా ప్రజల్ని నేరుగా కలిసి వారి సమస్యలు, దేశ పరిస్థితులపై వారి అభిప్రాయాలను తెలుసుకుంటామని చెప్పారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
దేశంలో నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా మారిందని, దానిని దేశవ్యాప్తంగా ప్రధాన చర్చనీయాంశంగా తీసుకెళ్తామని ఆయన అన్నారు. విద్యా సంస్కరణలపై కూడా ప్రత్యేక దృష్టిసారిస్తామని చెప్పారు. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్యా ఖరీదైందిగా మారిందని, విద్యను లాభార్జన మార్గంగా మార్చారని దానిని తాము మార్చాలని అనుకుంటున్నట్లు చెప్పారు.
విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా గురించి మాట్లాడుతూ.. ఆయన రాజీనామా చేయడం ఉద్యమానికి లభించిన అతిపెద్ద విజయమని, గత 10-12 ఏళ్లుగా మోడీ ప్రభుత్వం ప్రజల్ని తొక్కి పెట్టి ఉంచిందని, తమ ఉద్యమంతో ప్రజల్లో భయం పోయిందని, ప్రజలు మరింతగా వీధుల్లోకి వచ్చి తమ హక్కుల కోసం పోరాడుతారని వ్యాఖ్యానించారు. అంబేద్కర్, గాంధీ, నెహ్రూ కలలుగన్న అభివృద్ధి చెందిన భారత నిర్మాణమే తమ లక్ష్యమని దీప్కే అన్నారు.

